ఖమ్మం, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతులకు ఆర్థిక భరోసానిచ్చే ‘రైతుబంధు’పై కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నుతున్నదని, పథకాన్ని నిలిపివేయాలని ఆ పార్టీ నేతలు ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేశారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మండిపడ్డారు. ఖమ్మం నగరంలోని తెలంగాణ భవన్లో గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల కుయుక్తులను ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందకూడదనే ఆ పార్టీ నేతలు ఎలక్షన్ కమిషన్ను ఆశ్రయిస్తున్నారన్నారు. దీన్నిబట్టి ఆ పార్టీకి రైతులంటే ఎంత చిత్తశుద్ధి ఏమిటో అర్థం చేసుకోవచ్చన్నారు.
రైతుబంధు అందకపోతే రైతులు పెట్టుబడి సాయం అందక ఇబ్బంది పడతారన్నారు. కాంగ్రెస్ పాలనలో పంటలకు కరెంటు లేక రైతులు ఇబ్బందులు పడేవారని గుర్తుచేశారు. తెలంగాణ వచ్చిన తర్వాతే పంటలకు 24 గంటల పాటు ఉచితంగా నాణ్యమైన కరెంటు అందుతున్నదన్నారు. రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో ప్రజలు ఓట్ల బుద్ధి చెప్తారన్నారు. కాంగ్రెస్ పార్టీకి గాడ్సే వారసులు నాయకత్వం వహిస్తున్నారని ధ్వజమెత్తారు. రైతులు రైతు పక్షపాతి కేసీఆర్ కావాల్నో.. 3 గంటల కరెంట్ ఇచ్చే కాంగ్రెస్ పార్టీ కావాల్నో తేల్చుకోవాలన్నారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, నాయకులు ఉప్పల వెంకటరమణ, తాళ్లూరి జీవన్ కుమార్, డోకుపర్తి సుబ్బారావు, చింతనిప్పు కృష్ణ చైతన్య పాల్గొన్నారు.