‘అంబేద్కర్ విశ్వమానవుడు.. ఆయన ఒక ఊరికో.. ఒక పట్టణానికో.. ఒక ప్రాంతానికో.. లేదా ఒక రాష్ర్టానికో పరిమితమైన వ్యక్తి కాడు.. ప్రతి కార్మికుడు.. ప్రతి మహిళ.. ప్రతి బాధితుడి కోసం జీవితాన్ని ధారపోసిన మహనీయుడు.. సామాజిక విప్లవకారుడు.. అలాంటి ఆదర్శమూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ఆనందదాయకం.. మంత్రులు, అధికారులు అంబేద్కర్ విగ్రహాన్ని చూసి ప్రభావితం కావాలి.. అట్టడుగు,
అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపేందుకు విగ్రహం స్ఫూర్తిగా నిలవాలి.. అనునిత్యం అంబేద్కర్ను స్మరించుకోవాలి.. ఆయన ఆశయాలను అమలు చేయాలి..’ ఇవి అక్షరాలా హైదరాబాద్లో 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత సీఎం కేసీఆర్ ఉచ్ఛరించిన మాటలు. వీటిని బట్టి అంబేద్కర్పై కేసీఆర్కు ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవచ్చు.. అంబేద్కర్ జయంతి సందర్భంగా జరిగిన ఈ విగ్రహావిష్కరణను సబ్బండ వర్గాలు హర్షిస్తున్నాయి.. ఉపాధ్యాయులు, టీచర్లు, విద్యార్థులు, దళిత సంఘాల నేతలు, సాధారణ పౌరులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు..
– నమస్తే నెట్వర్క్
విజ్ఞాన జ్యోతి అంబేద్కర్..
వెలివాడల్లో బతుకుతూ ఎన్నో తరాలు ఇబ్బందిపడ్డాం. అణచివేతను ఎదుర్కొన్నాం. వివక్షకు గురయ్యాం. సాక్షాత్తు అంబేద్కర్ వంటి మహనీయుడే వివక్ష ఎదుర్కొన్నారు. అణచబడిన వర్గాల అభ్యున్నతికి కోసం, సమానత్వం కోసం ఎంతో చదువుకున్నారు. బడుగుల జీవితాల్లో వెలుగుల కోసం ఎన్నో త్యాగాలు చేశారు. మాలాంటి ఎంతోమంది జీవితాలకు వెలుగు బాట అయ్యారు.
చదువుకుంటే మన చెంతకు అన్నీ వస్తాయని తెలియజెప్పి విజ్ఞాన జ్యోతి వెలిగించాడు. ఒకప్పుడు అంబేద్కర్ విగ్రహం గ్రామ శివారులోనే ఉండేవి. ఇప్పుడు సీఎం కేసీఆర్ హైదరాబాద్ నగర నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించారు. అత్యంత శ్రద్ధాసక్తులతో ఆవిష్కరణ వేడుక నిర్వహించారు. సచివాలయానికి అంబేద్కర్ నామకరణం చేశారు. ఇవన్నీ మాకెంతో ఆనందాన్నిస్తున్నాయి.
– మారపాక రమేశ్, అంబేద్కరిస్ట్, అడ్వకేట్, కొత్తగూడెం
హక్కుల ప్రదాత అంబేద్కర్..
భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను అందరివాడిగా భావించిన సీఎం కేసీఆర్ హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు ఆనందాన్నిచ్చింది. విజ్ఞాన జ్యోతి, విద్యాప్రదాత, విశ్వనరుడికి దక్కిన గౌరవం ఇది. మానవ మనుగడ ఉన్నంత కాలం అంబేద్కర్ ప్రజల గుండెల్లో నిలిచిపోతారు. పేదరికం, వివక్షకు ప్రధాన కారణం కుల వ్యవస్థేనని వాటి అడ్డుగోడలను బద్దలు కొట్టి అంబేద్కర్ అణగారిన వర్గాలకు హక్కులు, స్వేచ్ఛా స్వాతంత్య్రాలు అందించారు. నాడు వర్ణవ్యవస్థకు కట్టుబడిన నేతలను ఎదుర్కొన్నారు. అంబేద్కర్ భౌతికంగా మన మధ్య లేకున్నా ఆయన ఆలోచనలు, రచనలు ముందు తరాలను ప్రభావితం చేస్తాయి. అంబేద్కర్ స్ఫూర్తితో సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేయడం అభినందనీయం.
– డాక్టర్ మార్జిమానా జూపూడి, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఉమెన్స్ డిగ్రీ కళాశాల, ఖమ్మం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా హైదరాబాద్ నడిబొడ్డున నిర్మించిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్కు ఇచ్చిన సముచిత గౌరవంగా అభివర్ణిస్తున్నాయి.. ఉపాధ్యాయులు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, విద్యార్థులు, దళిత సంఘాల నాయకులు తమ అభిప్రాయాలను ‘నమస్తే’తో పంచుకున్నారు. సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సీఎం మున్ముందు అణగారిన, అట్టడుగు వర్గాల కోసం మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతున్నారు.
– నమస్తే నెట్వర్క్
అంబరమంత సంబురం..
కన్నీరు, కలలు, వివక్ష, ఆకలి, అవమానం గురించి తెలిసిన వ్యక్తిగా అంబేద్కర్ నాడే ముందు తరాల గురించి ఆలోచించాడు. కులం పునాదుల మీద జాతిని నిర్మించలేమని గుర్తించాడు. అంటరానివాడిగా వివక్ష ఎదుర్కొన్నప్పటికీ విద్యతో జాతిని జాగృతం చేయవచ్చని నమ్మి విద్యావంతుడయ్యాడు. అన్నివర్గాల సంక్షేమం కోసం ఆలోచించాడు. రాజ్యాంగం ద్వారా ప్రతి మనిషికి హక్కులు కల్పించాడు. అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చేందుకు సీఎం కేసీఆర్ పూనుకుని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. అంబేద్కర్ ఖ్యాతి ఆకాశమంత అని చాటి చెప్పేందుకు హైదరాబాద్లో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహావిష్కరణ ఘట్టం. మహాద్భుతం.
– ఎన్.వెంకన్న, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల, ఖమ్మం
మాట నిలబెట్టుకున్న కేసీఆర్
కేంద్రం ఎనిమిదేళ్ల క్రితం ముంబైలో అంబేద్కర్ విగ్రహం నిర్మిస్తామని శంకుస్థాపన పనులు పూర్తి చేసింది. అరకొరగా పనులు చేపట్టింది. ప్రస్తుతం విగ్రహ నిర్మాణ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కానీ .. సీఎం కేసీఆర్ మాత్రం అంబేద్కర్ జయంతి రోజున 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని ప్రకటించి సకాలంలో పూర్తి చేయించారు. బౌద్ధ సంప్రదాయం ప్రకారం విగ్రహావిష్కరణ వేడుక నిర్వహించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే మహానేత సీఎం కేసీఆర్.
– మేకతోటి కాంతయ్య, మాల మహానాడు జాతీయ ప్రధాన కార్యదర్శి, పెనుబల్లి
యావత్ జాతికి మేల్కొలుపు
హైదరాబాద్లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ యావత్ జాతికి మేల్కొలుపు. విగ్రహావిష్కరణ వేడుక దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాష్ట్ర పరిపాలన భవనానికి అంబేద్కర్ పేరు పెట్టడం మరో గొప్ప విషయం. అంబేద్కర్పై సీఎం కేసీఆర్కు ఉన్న అపార గౌరవంతోనే నామకరణానికి పూనుకున్నారు. అంబేద్కర్కు దక్కాల్సిన సముచిత గౌరవాన్ని కేసీఆర్ కల్పించారు. కేసీఆర్ మున్ముందు అణగారిన వర్గాల కోసం మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలి.
– వేము రత్నాకర్, ఉపాధ్యాయ సంఘం నేత, సత్తుపల్లి
ఆవిష్కరణ ఘట్టం.. అద్భుతం..
హైదరాబాద్లో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ వేడుకకు నేను హాజరయ్యాను. నేను 30 ఏళ్లుగా అందరి సహకారంతో గ్రామాల్లో వందలాది అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేయించాను. ఎన్నో విగ్రహాలను ఆవిష్కరించాను. అయినప్పటికీ హైదరాబాద్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఘట్టం నాకు అద్భుతంగా తోచింది. వేడుకను చూసి పులకించాను. ప్రభుత్వ లాంఛనాలతో విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు. అంబేద్కర్ స్ఫూర్తితో సీఎం కేసీఆర్ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారు. యావత్ దేశాన్ని తెలంగాణ వైపు చూసేలా చేశారు.
– మద్దెల రవి, అంబేద్కర్ యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, వైరా
విగ్రహం ఏర్పాటు ఆనందాన్నిచ్చింది..
హైదరాబాద్ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు అన్ని వర్గాలకు ఆనందాన్నిచ్చింది. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ భారీ విగ్రహం ఏర్పాటు చేసి ఆత్మ గౌరవ పతాకాన్ని ఎగురవేశారు. అంబేద్కర్పై ఎంతో అభిమానంతో సీఎం విగ్రహావిష్కరణకు పూనుకున్నారు. దేశంలో ఎక్కడా అమలు చేయని విధంగా సీఎం దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారు. అణగారిన వర్గాలను ఆదుకునేందుకు మున్ముందు మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలి.
– వాసుమళ్ల సుందర్రావు, మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పాల్వంచ
హైదరాబాద్కే ప్రత్యేక గుర్తింపు..
హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ సార్కు కృతజ్ఞతలు. దళితుల అభ్యున్నతికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నది. అంబేద్కర్ జయంతిని ఒక పండుగలా నిర్వహించింది. హైదరాబాద్కు ఎవరు వచ్చినా తప్పకుండా ఆత్మ గౌరవానికి ప్రతీక అయిన అంబేద్కర్ విగ్రహాన్ని చూడాల్సిందే. విగ్రహం హైదరాబాద్కే ప్రత్యేక గుర్తింపు తెచ్చింది.
– కలవల చంద్రశేఖర్, సింగరేణి ఎస్సీ లైజన్ ఆఫీసర్, కొత్తగూడెం
దార్శనికుడు సీఎం కేసీఆర్..
అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న ఏకైక నేత ముఖ్యమంత్రి కేసీఆర్. అంబేద్కర్ స్ఫూర్తితోనే ఆయన తెలంగాణ సాధించారు. చిన్న రాష్ర్టాల ఏర్పాటుతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మి ఉద్యమానికి ఊపిరి పోశారు. దార్శనికతతో ఇప్పుడు దేశ రాజకీయాలను మార్చేందుకు నడుం బిగించారు. హైదరాబాద్ నడిబొడ్డున అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహం ఏర్పాటు యావత్ భారత జాతికి గర్వకారణం.
– దామళ్ల వెంకన్న, సొసైటీ డైరెక్టర్, కల్లూరిగూడెం
ఆకాశమంతఆశయం..
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఏడు దశాబ్దాల తర్వాత బీఆర్ అంబేద్కర్కు సరైన గుర్తింపు లభించింది. హైదరాబాద్ నడిబొడ్డున ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి సముచిత స్థానం కల్పించారు. గత పాలకులు కుట్రపూరితంగా అంబేద్కర్ను ఒక వర్గానికి పరిమితం చేశారు. అంబేద్కర్ ఆశయాలు ఆకాశమంత అని చాటి చెప్పేందుకు కేసీఆర్ నడుం బిగించారు. అంబేద్కర్ విగ్రహం అంటే అది కేవలం విగ్రహం కాదు. గత పాలకులు దళితులను కేవలం ఓటు బ్యాంకుగా చూశారు తప్ప ఏనాడూ వారి బాగోగులు పట్టించుకున్న పాపాన పోలేదు. రిజర్వేషన్లు అంటే చదువుకు ఉపయోగపడేవి అన్నట్లు గత పాలకులు ప్రచారం చేశారు. అవి బడుగుల జీవితాలను మార్చే ఆయుధాలు అని ఎవరూ చెప్పలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ అంబేద్కర్ ఆశయాలకు కార్యరూపాన్నిస్తున్నారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభలో కేసీఆర్ ప్రసంగం అన్ని వర్గాలను ఆకట్టుకున్నది. దళితబంధు పథకం ఎస్సీల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. సీఎం కేసీఆర్ మున్ముందు మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుకుంటున్నారు. ఆయన జాతీయ రాజకీయాల్లో సత్తా చాటి దళితబంధు వంటి పథకాలు అమలు చేస్తే బాగుంటుంది.
– గుమ్మడి విద్యాసాగర్, అధ్యాపకుడు, ప్రభుత్వ జూనియర్ కాలేజీ, ఇల్లెందు రాష్ట్రప్రభుత్వానిది ఘనమైన మార్గం..
అట్టడుగు వర్గాలకు మాత్రమే కాకుండా సామాజిక, రాజకీయ, ఆర్థికం, సాంస్కృతిక రంగాల్లో వెనుకబడి ఉన్న ప్రతి వ్యక్తి అభ్యున్నతి కోసం అంబేద్కర్ తన మేధస్సును ధారపోశారు. తరతరాలుగా దాస్య శృంఖలాల్లో ఉన్న, వివక్షతో మగ్గిపోతున్న అణగారిన వర్గాలకు రాజ్యాంగంతో హక్కులు కల్పించారు. మహిళల స్వావలంబన కోసం కృషి చేశారు. ఒక మనిషికి ఒక ఓటు.. ఒకే విలువ అనే అంశాన్ని ప్రజాస్వామ్య వ్యవస్థకు బలమైన పునాదిగా నిలిపారు. దేశంలో చిన్న రాష్ర్టాల ఏర్పాటుకు రాజ్యాంగం ద్వారా అవకాశం కల్పించారు. సీఎం కేసీఆర్ ఆ అవకాశాన్ని తెలుసుకుని తెలంగాణ కోసం ఉద్యమించారు. స్వరాష్ర్టాన్ని సాధించారు. హైదరాబాద్లో 125 అడుగుల విగ్రహాన్ని నిర్మించారు. రాష్ట్రప్రభుత్వం ఘనమైన మార్గాన్ని అనుసరిస్తున్నది.
– డాక్టర్ వడిగ శాంతికుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఖమ్మం