పోడు భూముల సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహం సత్ఫలితాలు ఇస్తున్నది. పోడు భూముల లెక్క తేల్చడంతోపాటు అర్హులైన రైతులకు పట్టాలు ఇచ్చేందుకు అధికార యంత్రాంగం సర్వేను వేగవంతం చేసింది. భద్రాద్రి జిల్లాలో 332 గ్రామపంచాయతీలు ఉండగా.. 726 హ్యాబిటేషన్లుగా విభజించింది. 305 బృందాలు సర్వే ప్రక్రియలో నిమగ్నమయ్యాయి. ఎలాంటి వివాదాలు తలెత్తకుండా అధికారులు పక్కా ప్రణాళికతో సర్వే చేస్తున్నారు. ఈ నెలాఖరు వరకు సర్వే పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించడంతో క్షేత్రస్థాయిలో సిబ్బంది ఆ దిశగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 83,663 దరఖాస్తులు రాగా.. 45,682 దరఖాస్తులను పరిశీలించారు. 2,94,890 ఎకరాల్లో పోడు భూములు ఉండగా.. 1,13,218 ఎకరాల్లో సర్వే పూర్తి అయ్యింది. ఈ ప్రక్రియ పూర్తయితే ఏళ్లతరబడి గిరిజనులు, అటవీశాఖ మధ్య నెలకొన్న వివాదం కొలిక్కి రానున్నది.
– భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ)
భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ) : అటవీ భూములకు ఇక పక్కాగా రక్షణ ఉండబోతున్నది.. ఎన్నో ఏళ్ల నుంచి అటవీశాఖ, పోడు రైతుల మధ్య ఉన్న వివాదం కొలిక్కి రాబోతున్నది. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం గిరిజనుల రైతుల పాలిట వరంగా మారింది. ఇప్పటివరకు పోడు సాగులో ఉన్న రైతులకు పట్టాలు ఇచ్చేందుకు అధికార యంత్రాంగం సర్వే ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ నెల చివరి వరకు పోడు సర్వే పూర్తయ్యే విధంగా కలెక్టర్ అనుదీప్ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. అధికార యంత్రాంగం సర్వే పనులను హ్యాబిటేషన్లు వారీగా చేపడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇప్పటివరకు వచ్చిన 83,663 దరఖాస్తులు రాగా వాటిలో 45,682 దరఖాస్తులను పరిశీలించారు.
తేలనున్న అటవీ భూములు
పోడు సర్వేతో జిల్లావ్యాప్తంగా అటవీ భూములు లెక్క తేలిపోనున్నది. గిరిజన రైతులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు హక్కు కలుగనున్నది. అటవీ ప్రాంతంలో పోడు భూముల సర్వే పక్కాగా జరుగుతున్నది. ఐటీడీఏ, అటవీశాఖ సంయుక్తంగా సర్వే ప్రారంభించింది. అందులో పంచాయతీ సెక్రటరీ, అటవీ, రెవెన్యూ శాఖల అధికారులతో పాటు ఎఫ్ఆర్సీ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. రెండునెలలపాటు జరిగే ఈ సర్వేలో ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా వివరాలను తెలుసుకుంటున్నారు. గతేడాది నవంబర్లో పోడు భూములు కలిగిన గిరిజన, గిరిజనేతర రైతులు మీసేవా ద్వారా దరఖాస్తులు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను పరిగణలోకి తీసుకుంటున్న అధికారులు సర్వే ప్రారంభించారు. సర్వే నంబర్ల ఆధారంగా ప్రక్రియ కొనసాగుతున్నది. జీపీఎస్ సిస్టమ్ను కూడా సర్వేలో ప్రామాణికంగా తీసుకుంటున్నారు.
2,94,890 ఎకరాల్లో పోడు భూములు
జిల్లావ్యాప్తంగా గిరిజనులు ఉండే ప్రాంతాల్లో పోడు భూములను రైతులు ఇప్పటికే సాగు చేసుకుంటున్నారు. ఇందులో అటవీహక్కుల చట్టం పరిధిలో కొంత ఉండగా మరికొన్ని వివాదాస్పదంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ సాగు చేసుకుంటున్న రైతుల వివరాలను పరిశీలిస్తూ అధికారులు సర్వే చేస్తున్నారు. ఇందులో 332 గ్రామపంచాయతీల పరిధిలో 726 గ్రామాల్లో గిరిజనులు, గిరిజనేతరులు పోడు సాగు చేసుకుంటున్నారు. గతంలో సర్వే రిపోర్టు ఆధారంగా జిల్లాలో భూమి విస్తీర్ణం 17,47,971 లక్షల ఎకరాలు ఉండగా, దీనిలో అటవీ విస్తీర్ణం 10,13,698 ఎకరాలు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇందులో పోడు భూములు 2,29,229 ఎకరాలు సాగులో ఉన్నట్లు గుర్తించారు. 64,491 మంది గిరిజనుల దరఖాస్తులు చేసుకున్నారు. గిరిజనేతరులు 18,246 మంది దరఖాస్తులు చేసుకున్నారు. అత్యధికంగా గుండాల, టేకులపల్లి, ఇల్లెందులో పోడు భూమి సాగులో ఉంది. గుండాలలో 20,396 ఎకరాలు పోడు రైతులు భూమిని సాగుచేస్తున్నారు. ఎక్కువగా పినపాక నియోజకవర్గంలోనే పోడుభూమిని రైతులు సాగు చేస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి.
కలెక్టర్ పర్యవేక్షణ
అటవీ పోడు భూములు ఆక్రమణలకు గురైనట్లు వచ్చిన ఆరోపణలను పరిగణలోకి తీసుకున్న అధికారులు సర్వేను జీపీఎస్ సిస్టమ్తో పక్కాగా చేస్తున్నారు. ఎక్కడా ఎలాంటి వివాదాలకు తావులేకుండా కలెక్టర్ అనుదీప్, ఎస్పీ వినీత్, అటవీఅధికారి రంజిత్, ఐటీడీఏ పీవో గౌతం సర్వే ప్రక్రియను నిశితంగా పరిశీలిస్తున్నారు. దీంతోపాటు ప్రజాప్రతినిధులు కూడా సర్వేలో సమస్యలు తలెత్తకుండా సహకరిస్తున్నారు. ఇప్పటినుంచి అడవి జోలికి వెళ్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. దీంతో అటవీ భూములకు ఇక పక్కాగా రక్షణ ఉండనున్నది. అన్ని ఆధారాలు ఉంటేనే సర్వే ద్వారా గిరిజన రైతులు పోడు భూమికి హక్కు పొందే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. కలెక్టర్ ఆయా శాఖల అధికారులు ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి జాగ్రత్తలు, సలహాలు చెబుతున్నారు. ఇందుకు రైతులు సహకరిస్తున్నారు.
సీఎం కేసీఆర్ది పెద్దమనసు
గిరిజన ప్రాంతం లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోడు సమస్యకు చక్కటి పరిష్కారం చూపారు మన సీఎం కేసీఆర్. పోడు సర్వే వేగవంతంగా జరుగుతున్నది. అర్హులందరికీ పోడు పట్టాలు వస్తాయి. ఎలాంటి సందేహం లేదు. ఎవరూ ఎలాంటి అపోహలు పడాల్సిన అవసరం లేదు. గిరిజనులపై రాష్ట్ర సర్కార్కి చిత్తశుద్ధి ఉందని నిరూపించారు.
-కోరం ఉమ, కోయగూడెం సర్పంచ్
గిరిజనులకు ఇక పోడుపై హక్కు
ఎప్పటినుంచో మేము పోడు భూముల మీద ఆధారపడి సాగు చేసుకుంటున్నాము. మా పంచాయతీలో చాలామంది రైతులు ఉన్నారు. చాలాసార్లు ఇబ్బందులు పడ్డాము. సీఎం కేసీఆర్ చూపిన చొరవ వల్ల మాకు న్యాయం జరుగుతున్నది. ఎమ్మెల్యే రేగా కాంతారావు మా గిరిజనులకు అండగా ఉన్నారు. మా భూముల్లో సర్వే ముమ్మరంగా జరుగుతున్నది.
– కారం ముత్తయ్య, గుట్టమల్లారం సర్పంచ్, మణుగూరు