ఖమ్మం, డిసెంబర్ 28: అర్హులకు ప్రభుత్వ పథకాల లబ్ధిని చేకూర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. అభయహస్తం ఆరు గ్యారెంటీలకు దరఖాస్తు చేసుకునేందుకు కుల, ఆదాయ సర్టిఫికెట్లు అవసరంలేదని, ఆధార్, ఆహార భద్రత కార్డుల జిరాక్సులు జతపరిస్తే సరిపోతుందని స్పష్టం చేశారు. కుటుంబం యూనిట్గా ఒకే దరఖాస్తు సమర్పించాలని సూచించారు. ఖమ్మం నగరంలో గురువారం పర్యటించిన ఆయన.. 29వ డివిజన్ ప్రొఫెసర్ జయశంకర్ పారు వద్ద నిర్వహించిన ప్రజాపాలన సభలో సీపీ విష్ణు ఎస్ వారియర్తో కలిసి పాల్గొన్నారు. తొలుత సభ ఏర్పాట్లు, కౌంటర్లు, స్వీకరించిన దరఖాస్తులు, ప్రజలు తెచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. అలాగే, ప్రజలు దరఖాస్తులు సమర్పించాక అధికారులు వాటిని నమోదు చేసుకొని ప్రతిగా తిరిగి రసీదును అందిస్తున్నదీ లేనిదీ అడిగి తెలుసుకున్నారు. అధికారులు నెంబరు వేసి ఇచ్చిన దరఖాస్తును భద్రపర్చుకోవాలని సూచించారు. కౌంటర్లలో విధులు నిర్వర్తించే అధికారులు.. ప్రజలు తెచ్చే దరఖాస్తుల్లో అన్ని వివరాలు పొందుపర్చి ఉన్నాయో లేదో గమనించాలని, వారు పూరించని వివరాలు వారికి అర్హత లేకనే వదిలేశారో లేదో తెలుసుకోవాలని, దరఖాస్తుదారులు సందేహాలు వ్యక్తం చేస్తే వాటిని నివృత్తి చేయాలని సూచించారు.
ప్రజలు జిరాక్స్ తీసిన అప్లికేషన్ ఫారాలను కూడా పూరించి సమర్పించవచ్చని అన్నారు. కాగా, సభలో ముందుగా ప్రజాపాలన కార్యక్రమం ఉద్దేశం వివరిస్తూ ముఖ్యమంత్రి ప్రజలకు పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రజాపాలన గ్రామసభల నిర్వహణకు 62 బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దరఖాస్తు ఫారాలను ప్రతి ఇంటికి సరఫరా చేస్తున్నామన్నారు. దరఖాస్తుదారులు ముందుగానే తమ దరఖాస్తులను నింపి సభ వద్దకు రావాలని సూచించారు. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాల దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, కుటుంబం నుంచి ఒకరు వచ్చి దరఖాస్తు చేస్తే సరిపోతుందని, అన్ని పథకాలకు కలిపి కుటుంబం యూనిట్గా ఒక దరఖాస్తు మాత్రమే సమర్పించాలని సూచించారు. సందేహాలుంటే హెల్ప్ డెసుల్లో అడిగి నివృత్తి చేసుకోవచ్చని, దరఖాస్తు నింపడంలో అధికారుల సహాయం పొందవచ్చని తెలిపారు. దరఖాస్తుల్లో పొందుపరిచిన వివరాలను నమోదు చేసుకుంటామని, అర్హులందరికీ పథకాలు వర్తింపజేస్తామని అన్నారు. గ్రామసభల సమయంలో అందుబాటులో లేని వారు ఆందోళన చెందొద్దని, జనవరి 6 వరకు తమ దరఖాస్తులను వార్డు, పంచాయతీ కార్యాలయాల్లో అందజేయవచ్చని సూచించారు. సభల షెడ్యూల్ గురించి ఇప్పటికే విస్తృతంగా ప్రచారం చేస్తున్నామన్నారు. కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, జడ్పీ సీఈవో అప్పారావు, ఇతర అధికారులు విజయలక్ష్మి, శ్రీరామ్, హరికృష్ణ, సత్యనారాయణరెడ్డి, కార్పొరేటర్ కే.సరిత తదితరులు పాల్గొన్నారు.
మామిళ్లగూడెం, డిసెంబర్ 28 : ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జిల్లాలోని 121 ప్రదేశాల్లో గ్రామసభలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ప్రజలు తమ ఆధార్ కార్డుల్లో ఉన్న పాత రాష్ట్రం పేరు ఆంధ్రప్రదేశ్ను తెలంగాణగా మార్పులు చేయాల్సిన అవసరం లేదని సూచించారు.