ఖమ్మం, డిసెంబర్ 19 : జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతంగా పూర్తి చేయాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు 231 కేంద్రాలను ప్రతిపాదించి.. మంగళవారం నాటికి 226 కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు. 93 కేంద్రాల్లో ఇప్పటివరకు 18505.160 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు రైస్ మిల్లుల తనిఖీలు చేపట్టి సీఎంఆర్ ఎంత? ఇతరాలు ఎంతమేర ఉన్నాయనేది చూడాలన్నారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ధాన్యం కొనుగోళ్లను పరిశీలించాలన్నారు.
ఏ దశలోనూ కొనుగోళ్లలో ఆలస్యం చేయొద్దని, కొన్న ధాన్యం నమోదులు పూర్తి చేసి వెంటవెంటనే రైస్ మిల్లులకు తరలించాలని ఆయన తెలిపారు. వోబీఎంఎస్ నమోదులు త్వరితగతిన పూర్తి చేసి రైతులకు ధాన్యం డబ్బులు సకాలంలో అందేలా చర్యలు చేపట్టాలన్నారు. గత ఏడాది ఇదే సమయంలో ఎంతమేర సేకరించింది.. ఇప్పుడు ఎంత సేకరించింది పరిశీలన చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. సమీక్షలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.సత్యప్రసాద్, జిల్లా వ్యవసాయాధికారి విజయనిర్మల, జిల్లా సహకార అధికారి విజయకుమారి, జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీలత, జిల్లా మారెటింగ్ అధికారి ఎంఏ.అలీం, అదనపు డీఆర్డీవో జయశ్రీ, అధికారులు పాల్గొన్నారు.