ఖమ్మం, ఫిబ్రవరి 14 : కృష్ణా బేసిన్లో సాగునీటి అవసరాలకు సరిపోయేంత నీరు లేకపోవడంతో ప్రస్తుత యాసంగి సీజన్లో క్రాప్ హాలిడే ప్రకటించినట్లు కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. బుధవారం నూతన కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మిషన్ భగీరథ, పంచాయతీరాజ్, మున్సిపల్, నీటిపారుదల శాఖల అధికారులతో తాగునీటి సరఫరాపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేసవిలో తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాలను ముందస్తుగా గుర్తించి.. సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. నాగార్జున సాగర్పై సాగు, తాగునీటికి ఆధారపడి ఉన్నామని, సాగర్ నుంచి పాలేరుకు నీరొస్తే సమస్యలు తీరుతాయన్నారు. వచ్చే మూడు నెలలు అత్యంత కీలకమైనవని, ఇందుకోసం పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.
నీటిపారుదల శాఖ అధికారులు నిత్యం ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ అధికారులతో టచ్లో ఉండాలన్నారు. మిషన్ భగీరథ అందుబాటులో లేని ప్రాంతాల్లో పైపులైన్ వేయాలా.. సమస్య ఎలా పరిషరించాలో ఆలోచన చేయాలన్నారు. నీటి సరఫరా ఇబ్బందులు ఉన్నచోట ఓపెన్ వెల్, బోర్లు లీజుకు తీసుకునే చర్యలు చేపట్టాలన్నారు. తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలతో అధికారులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ బి.సత్యప్రసాద్, మిషన్ భగీరథ ఎస్ఈ సదాశివకుమార్, పీఆర్ ఎస్ఈ చంద్రమౌళి, డీపీవో హరికిషన్, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, నీటిపారుదల, తాగునీటి సరఫరా శాఖల ఇంజినీర్లు పాల్గొన్నారు.