పర్ణశాల, డిసెంబర్ 12 : పర్ణశాలలో ఈ నెల 22, 23 తేదీల్లో జరిగే ముక్కోటి ఏకాదశి వేడుకల ఏర్పాట్లను కలెక్టర్ ప్రియాంక ఆల మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ముందుగా తెప్పోత్సవం జరిగే ప్రాంతాన్ని పరిశీలించి నీటిపారుదల శాఖ అధికారులతో మాట్లాడారు. గోదావరి నదిలో జరిగే తెప్పోత్సవ కార్యక్రమానికి భారీస్థాయిలో భక్తులు వస్తారని, వారికి ఇబ్బందులు కలగకుండా ఏర్పా ట్లు చేయాలని సూచించారు. భక్తులు నదిలోకి దిగకుండా బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. రేవు వద్ద విద్యుత్ దీపాలు, భక్తుల కోసం మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని, స్థానిక హోటళ్లలో ఆహార పదార్థాలను ప్రతీ రోజు తనిఖీ చేయించాలన్నారు. భక్తులు స్వచ్ఛమైన భగీరథ నీరు అందిస్తున్నామని సంబంధిత శాఖ అధికారులు కలెక్టర్కు తెలిపారు. అనంతరం ఆలయ చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించి ప్రధాన మార్గంలో ఆలయానికి అడ్డుగా ఉన్న షాపులను తొలగించాలని అధికారులకు సూచి ంచారు.
ఆలయంలో జరిగిన ఏర్పాట్లపై దేవాదా య శాఖ అధికారులతో సమీక్షించారు. ఆలయ అధికారులు, అర్చకులు కలెక్టర్ను ఆలయ మర్యాదలతో సాదర స్వాగతం పలికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పంచవటిని దర్శించి ఆలయ చరిత్రను అడిగి తెలుసుకున్నారు. ఉత్తర ద్వార దర్శనం జరిగే ప్రాంతాన్ని పరిశీలించి పారిశుధ్య పనులు చేపట్టాలని పంచాయతీ అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో మంగీలాల్, విద్యుత్ శాఖ డీఈ జీవన్కుమార్, ఇరిగేషన్ ఈఈ రాంప్రసాద్, డీఎంహెచ్వో శిరీష, ఆర్డబ్ల్యూఎస్ డీఈ ఏసుబాబు, సీఐ రమేశ్, దేవాదాయ శాఖ ఏఈవో భవాని రామకృష్ణ, డీపీవో లక్ష్మీరమాకాంత్, తహసీల్దార్ చంద్రశేఖర్రావు, ఎంపీడీవో ముత్యాలరావు, జడ్పీటీసీ తెల్లం సీతమ్మ, ఎంపీపీ రేసు లక్ష్మీ, ఏవో నవీన్తోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.