భద్రాచలం, డిసెంబర్ 12 : ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలకు భద్రాచలం వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, సెక్టార్ల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం భద్రాచలం సబ్ కలెక్టర్ సమావేశ మందిరంలో అన్ని శాఖల జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడా రు. 22న జరిగే తెప్పోత్సవం, 23న నిర్వహించే ఉత్తర ద్వార దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకూడదన్నారు. వివిధ శాఖలకు అప్పగించిన పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. గోదావరి తీరం వద్ద బారికేడింగ్ ఏర్పాటుతోపాటు లోతును తెలిపేలా హెచ్చరిక బోర్డు లు, గజ ఈతగాళ్లను, నాటు పడవలను ఏర్పాటు చేయాలని సూచించారు. తెప్పోత్సవం సమయం లో పటాకులు కాల్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, దీనిని అగ్నిమాపక శాఖ అధికారులు పర్యవేక్షించాలన్నారు. పట్టణంలో ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపట్టేందుకు అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలన్నారు. వి ద్యుత్కు అంతరాయం లేకుండా చూడాలని ఎన్పీడీసీఎల్ డీఈ జీవన్కుమార్కు తెలిపారు. వీవీఐపీల వాహనాలకు పార్కింగ్ ఏర్పాటు గురించి సీఐ నాగరాజ్రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. డిసెంబర్ 22, 23 తేదీల్లో మద్యం, మాంసం విక్రయాలను నిలిపివేయాలని, ఆర్డీవో, ఏఎస్పీ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని సూచించారు. తెప్పోత్సవంలో హంస వాహనంపై ఎక్కే వారికి ప్రత్యేక పాస్లు జారీ చేయాలన్నారు.
భక్తులు ఇబ్బంది పడకుండా సమాచార కేంద్రాలను ఏర్పాటు చేయాలని డీపీఆర్వో శ్రీనివాస్ను ఆదేశించగా.. తొమ్మిది ప్రదేశాల్లో సమాచార కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. టికెట్లు కొనుగోలు చేసిన వారు ఇబ్బందులు పడుతున్నారని, వీవీఐపీల వెంట వచ్చేవారిని అనుమతించొద్దని సూచించారు. ఈసారి ఇతర జిల్లాల నుంచి భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అదనపు బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ డీఎం రామారావును ఆదేశించారు. భద్రాచలం వచ్చిన భక్తులు పర్ణశాలను కూడా దర్శిస్తారని, ప్రతి పది నిమిషాలకు ఒక బస్సును నడపాలని చెప్పారు. బస్టాండ్, మూత్రశాలలు, మరుగుదొడ్లను ప్రతి రెండు గంటలకు ఓమారు సిబ్బందితో క్లీన్ చేయించాలన్నారు. అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక డాక్టర్లు, అంబులెన్స్లను ఏర్పాటు చేయాలని డీఎంఅండ్హెచ్వో డాక్టర్ శిరీషను ఆదేశించగా.. 25 మంది డాక్టర్లు, 85 మంది పారా మెడికల్ సిబ్బందిని, భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో 10 పడకలను సిద్ధంగా ఉంచామన్నారు. సమావేశంలో ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్లు రాంబాబు, మధుసూదనరాజు, డీఆర్వో రవీంద్రనాథ్, దేవస్థానం ఈఓ ఎల్.రమాదేవి, ఆర్డీఓ మంగీలాల్, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ రాకపోవడంతో అతడికి షోకాజ్ నోటీస్ జారీ చేయాలని ఆదేశించారు. అనంతరం తెప్పోత్సవం జరిగే గోదావరి తీరాన్ని, హంస వాహనం ఎక్కేందుకు ఏర్పాటు చేస్తున్న ర్యాంప్ను పరిశీలించారు.