భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ అంకిత్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కొత్తగూడెంలో నిర్మాణంలో ఉన్న పనులను క్షేత్రస్థాయిలో కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. పనుల పురోగతి గురించి సంబంధిత శాఖల అధికారులను అడిగి తెలుసుకున్న కలెక్టర్.. పనులను త్వరితగతిన పూర్తి చేసి డిసెంబర్ నాటికి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
వివిధ బ్లాక్లతోపాటు బాయ్స్, గర్ల్స్ హాస్టల్, తరగతి గదులు, ల్యాబోరేటరీ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నాణ్యతా ప్రమాణాలతో పనులు చేపట్టాలని, ఎలాంటి జాప్యం లేకుండా వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రస్తుతానికి కళాశాల ప్రధాన భవనాలు, హాస్టల్ నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
కళాశాలలో ప్రతీ ఏడాది 150 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు కలెక్టర్కు వివరించారు. అలాగే నర్సింగ్ కళాశాలలో విద్యార్థులకు అందుతున్న బోధన, వసతి, తరగతి గదులు, ల్యాబోరేటరీలు, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలపై కలెక్టర్ ఆరా తీశారు. విద్యార్థులకు అన్ని సదుపాయాలు సమకూరుతున్నాయా? ఇంకా ఏమైనా అదనపు వసతులు అవసరమా? అనే అంశాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట వైద్య, ఇంజినీరింగ్, నిర్మాణ శాఖల అధికారులు, నర్సింగ్ కళాశాల అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఉన్నారు.