భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 7 (నమస్తే తెలంగాణ): సింగరేణి బొగ్గు ఉత్పత్తి పాటు విజయవంతంగా థర్మల్, సోలార్ విద్యుత్ ఉత్పత్తి రంగంలోనూ అడుగుపెట్టిందని, అలాగే దేశవ్యాప్తంగా సోలార్ రంగంలో ఉండే అవకాశాలను అందిపుచ్చుకోవాలని సంస్థ సీఎండీ బలరాం పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని సింగరేణి భవన్లో ఆదివారం థర్మల్, సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. సంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించే క్రమంలో ఇతర రాష్ర్టాల్లోనూ సోలార్ ప్రాజెక్టులు నిర్మించాలని సూచించారు. రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక వంటి రాష్ర్టాల్లో సోలార్ రంగంలోకి అడుగుపెట్టేందుకు అధ్యయనం చేయాలన్నారు. అవసరమైతే సంయుక్త భాగస్వామ్య ప్రాజెక్టులనూ స్వాగతించాలన్నారు. మొదటి దశలో నిర్దేశించుకున్న 300 మెగావాట్ల సోలార్ ప్లాంట్లలో మిగిలి ఉన్న 76 మెగావాట్ల ప్లాంట్లను మార్చి నెలాఖరులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. రెండో దశలో కంపెనీవ్యాప్తంగా 232 మెగావాట్ల ప్లాంట్లను చేపడుతున్నట్లు డైరెక్టర్ (ఈఅండ్ఎం) సత్యనారాయణరావు వివరించారు. సమావేశంలో సంస్థ డైరెక్టర్లు సత్యనారాయణ రావు (ఈఅండ్ఎం), ఎన్వీకే శ్రీనివాస్ (ఆపరేషన్స్), వెంకటేశ్వర్రెడ్డి (పీపీ), ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (సీఎం) జె.ఆల్విన్, జీఎం కో-ఆర్డినేటర్ ఎం.సురేశ్, జీఎం సీపీపీ జక్కం రమేశ్, జీఎం ఎంపీ మల్లెల సుబ్బారావు, జీఎం ఎస్టేట్స్ సురేశ్, జీఎం మార్కెటింగ్ దేవేందర్, జీఎం సివిల్ సూర్యనారాయణ, కార్పొరేట్ జీఎంలు పాల్గొన్నారు.
ఈ ఏడాది సింగరేణిలో ప్రారంభించే నాలుగు కొత్త గనులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మరికొన్ని బొగ్గు బ్లాకులను ప్రారంభిస్తామని సంస్థ సీఎండీ బలరాం స్పష్టం చేశారు. హైదరాబాద్లోని సింగరేణి భవన్లో ఆదివారం కొత్త గనులపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ఆయన మాట్లాడారు. నిర్దేశిత గడువులోపు పనులు పూర్తయేయలా ప్రణాళికలు రూపొందించుకోవాలని ఏరియాల జీఎంలను ఆదేశించారు. ఒడిశా నైనీ బొగ్గు బ్లాక్కు సంబంధించి ప్రస్తుత పరిస్థితిపై సమీక్షించారు. చివరి దశ అనుమతులకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వ సహకారం తీసుకోవాలన్నారు. ఈ విషయంలో ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క ప్రత్యేక చొరవ తీసుకొని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్తో చర్చించేందుకు ఈ నెల మూడో వారం భువనేశ్వర్ వెళ్తారని స్పష్టత ఇచ్చారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
రామవరం, జనవరి 7 : సింగరేణి కొత్తగూడెం ఏరియా రుద్రంపూర్ ప్రొఫెసర్ జయశంకర్ గ్రౌండ్స్లో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ ఆదివారం ఫైనల్కు చేరుకుంది. ఈ మ్యాచ్ను నూతనంగా బాధ్యతలు చేపట్టిన సీఎండీ బలరాం ప్రారంభించారు. చైర్మన్ 11, డైరెక్టర్స్ 11 మధ్య జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్లో డైరెక్టర్స్ 11 టీమ్ మొదట బ్యాటింగ్ చేసి 10 ఓవర్లకు 57 పరుగులు చేసింది. ఆ లక్ష్యాన్ని చైర్మన్ 11 టీం ఛేదించింది. డైరెక్టర్ ఎన్వీకే శ్రీనివాస్, డైరెక్టర్ వెంకటేశ్వర్రెడ్డి, ఇతర జీఎంలతో కలిసి ఆడారు. మూడో ప్లేస్ రామగుండం రీజియన్, కార్పొరేట్ మణుగూరు ఏరియా టీమ్ల మధ్య జరిగిన మ్యాచ్లో కార్పొరేట్, మణుగూరు ఏరియా టీం గెలుపొందింది. అనంతరం గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.