దశాబ్దాల నుంచి గిరిబిడ్డలు పోడు సమస్యను ఎదుర్కొంటున్నారు.. హక్కు పత్రాలు లేక అల్లాడిపోయారు.. ఎన్ని ప్రభుత్వాలు మారినా వారి జీవితాలు మారలేదు.. ఎంతమంది రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా ఫలితం దక్కలేదు.. సమస్య తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న సీఎం కేసీఆర్ అర్హులందరికీ పోడు హక్కు పత్రాలు ఇస్తామని గతంలో హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా పోడు భూములపై సర్వే చేపట్టారు. పోడు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అర్హులను గుర్తించి శుక్రవారం అసెంబ్లీ సాక్షిగా ఈనెలాఖరుకు పట్టాలు అందిస్తామని ప్రకటించారు. అలాగే గిరిజన రిజర్వేషన్ను 10 శాతానికి పెంచుతూ తీర్మానం చేశారు. దీంతో ఉమ్మడి జిల్లాకు చెందిన గిరిజనుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ఖమ్మం, ఫిబ్రవరి10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పోడు రైతులు దశాబ్దాల నుంచి ఎదుర్కొంటున్న సమస్యలకు సీఎం కేసీఆర్ పరిష్కారం చూపనున్నారు. ఈనెలాఖరు నుంచే రాష్ట్రవ్యాప్తంగా పట్టాలు పంపిణీ చేస్తామని శుక్రవారం అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. పట్టాల పంపిణీ మాత్రమే కాకుండా పంటలకు విద్యుత్ సౌకర్యం, రైతుబంధుతో పాటు గిరిజన వికాసం వంటి పథకాలను వర్తింపజేసేందుకు చర్యలు తీసుకుంటామనే ప్రకటన వెలువడడంతో గిరిజనులు, గిరిజనేతరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇక ముందు అటవీ భూములు ఆక్రమించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని రాష్ట్ర సర్కార్ ప్రకటించింది. అడువులను నరికి పోడు సాగు చేయడాన్ని సహించబోమని స్పష్టం చేసింది. పట్టాలు పంపిణీపై గతంలోనే పోడు రైతుల నుంచి దరఖాస్తులు తీసుకుని సర్వే చేపట్టిన అధికారులు ఇక నుంచి పట్టాల పంపిణీపై దృష్టి సారించనున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని దాదాపు అన్ని మండలాల్లో పోడు భూముల సమస్య నెలకొన్నది. ఖమ్మం జిల్లాలోని 10 మండలాల్లో ప్రధానంగా పోడు సమస్య ఇబ్బంది పెడుతున్నది. అటవీ భూముల పరిరక్షణలో అశువులు బాసిన ఎఫ్ఆర్వో శ్రీనివాసరావును దృష్టిలో పెట్టుకుని, ఇకపై అటవీశాఖ అధికారులపై దాడులు జరగకుండా ఉండే అంశాలపై రాష్టప్రభుత్వం దృష్టి సారించింది. అలాగే పోడు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. అటవీ భూముల పరిరక్షణతో పాటు పోడు రైతులకు న్యాయం చేసేలా నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్కు గిరిజనులు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నారు.
పోడు హక్కు పట్టాల పంపిణీకి ముందు ప్రభుత్వం పకడ్బందీగా పోడు భూములపై సర్వే చేపట్టింది. పోడు రైతుల నుంచి దరఖాస్తుల స్వీకరణ డ్రైవ్ నిర్వహించింది. 2021 నవంబర్ 8 నుంచి అధికారులు పోడు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. జిల్లావ్యాప్తంగా 10 మండలాల పరిధిలోని 94 పంచాయతీల్లోని 132 ఆవాసాలకు చెందిన పోడు రైతులు పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 25,515 ఎకరాల పట్టాల కోసం ఎస్టీ రైతుల నుంచి 9,507 దరఖాస్తులు అందాయి. ఇతరుల నుంచి 17,678 ఎకరాల పట్టాల కోసం 8,980దరఖాస్తులు అందాయి. ఉమ్మడి జిల్లా పరిధిలోని ఖమ్మం, కల్లూరు, కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం, రెవెన్యూ డివిజన్ పరిధిలో ఏర్పాటైన సబ్డివిజన్ స్థాయి కమిటీలు దరఖాస్తులను పరిశీలించి వాటిని జిల్లా స్థాయి కమిటీలకు సిఫారస్ చేశాయి. తాజాగా పోడు పట్టాలపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఇచ్చిన ప్రకటనతో పోడు రైతుల నుంచి హర్షం వ్యక్తమవుతున్నది.
భద్రాద్రి జిల్లాలోని 23 మండలాల్లో అధికారులు పోడు సమస్యను గుర్తించారు. మొత్తం 332 గ్రామాల్లో గ్రామసభలను నిర్వహించారు. పోడు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. 11,532 మందిని అర్హులుగా గుర్తించి పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. అందుకు 30,684 ఎకరాల పోడుభూమిని కూడా సర్వే చేశారు. మిగతా దరఖాస్తులను రెండో విడత పరిశీలించనున్నారు.
పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి తప్పించుకున్న ఎన్నో ప్రభుత్వాలు మట్టి కరిశాయి. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ గిరిజనులను ఎన్నో విధాలుగా ఆదుకున్నారు. పోడు భూములకు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం భూముల సర్వే చేపట్టి పట్టా లు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. నాకు నా లుగు ఎకరాల పోడు భూమి ఉంది. భూమికి సరైన పత్రాలు లేకపోవడంతో ఎన్నో ఏళ్లు ఇబ్బందులు ఎదుర్కొన్నా. మా సమస్యకు కేసీఆర్ శాశ్వత పరిష్కారం చూపుతున్నారు.
– ఆరెం లక్ష్మణ్, పోడు రైతు, కెప్టెన్బంజర, కామేపల్లి మండలం
భద్రాద్రి జిల్లాలో పోడు భూముల సమస్య తీవ్రంగా ఉంది. అనేక ఏళ్లుగా గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. పోడు భూములకు పట్టాలు వస్తాయని గిరిజనులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ గిరిజనులకు పోడు పట్టాలు పంపిణీ చేస్తామని ప్రకటించడంతో గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వమూ తీసుకోని గొప్ప నిర్ణయం ముఖ్యమంత్రి తీసుకున్నారు.
– భూక్యా సోనా, ఎంపీపీ, లక్ష్మీదేవిపల్లి
పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్న సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు. పోడు భూములకు పట్టాలు వస్తాయనే విషయం తెలిసి గిరిజనులంతా ఆనందపడుతున్నారు.తెలంగాణ వచ్చిన తర్వాతే ఎస్టీలకు ప్రాధాన్యత వచ్చింది. సీఎం కేసీఆర్ ఎస్టీల అభివృద్ధి కోసం రిజర్వేషన్ పెంచారు. పోడు రైతులకు పట్టాలు ఇవ్వనున్నారు. నిజమైన గిరిజన బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్.
– సపావత్ రాందాస్, పోడు రైతు, టేకులపల్లి
గిరిజనుల అభ్యున్నతి, సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ నిరంతరం శ్రమిస్తున్నారు. తెలంగాణ వచ్చిన నాటి నుంచి ఎస్టీల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారు. తాజాగా గిరిజన రిజర్వేషన్ పెంచి అసెంబ్లీలో తీర్మానం చేశారు. పోడు సమస్యకు పరిష్కారం చూపుతున్నారు. పోడు రైతుల తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు.
– భూక్యా రాధ, ఎంపీపీ, టేకులపల్లి
సీఎం కేసీఆర్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారు. చేసి చూపిస్తున్నారు. తాజాగా బడ్జెట్ సమావేశంలో గిరిజనులకు రిజర్వేషన్ను 10 శాతం పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రకటనపై ఎస్టీలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్తోనే అన్ని వర్గాలకు న్యాయం. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ అమలు కాని పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయి.
– లావుడ్యా సత్యనారాయణ, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి, సుజాతనగర్
బడ్జెట్ సమావేశాల్లో పోడు పట్టాలపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. ఆ నిర్ణయాన్ని గిరిజనులు స్వాగతిస్తున్నారు. అర్హులందరికీ పోడు పట్టాలు ఇస్తామనే ప్రకటన వెలువడడంతో గిరిజనులు ఆనందపడుతున్నారు. సీఎం సార్కు ఎస్టీలంతా రుణపడి ఉంటారు.
– కుంజా వెంకటేశ్ దొర,
గిరిజనుడు, అశ్వారావుపేట
బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా గిరిజనులకు పదిశాతం రిజర్వేషన్ ప్రకటించారు. రిజర్వేషన్ పెంపు నిర్ణయం గిరిజనులకు మరింత మేలు చేస్తుంది. గిరిజనులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఎస్టీల ఆత్మగౌరవాన్ని కాపాడి రిజర్వేషన్ పెంచిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు.
– బానోత్ రణ్యానాయక్, రావికంపాడు సర్పంచ్, చ్రండుగొండ మండలం
పోడు భూములకు పట్టాలు ఇస్తామనే సీఎం కేసీఆర్ ప్రకటనతో పోడు రైతులకు భరోసా వచ్చింది. కేసీఆర్ పోడు భూములకు పట్టాలు ఇవ్వలేరు.. ఆయనకు సాధ్యం కాదు అని ఎంతోమంది రాజకీయ నాయకులు నోరు పారేసుకున్నారు. కానీ కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు. ఇప్పటికే పోడు భూముల సర్వే పూర్తి చేశారు. అభ్యంతరాలను స్వీకరించి వాటికి పరిష్కారం చూపారు. నాకు రెండున్నర ఎకరాల పోడు భూమి ఉంది. ఆ భూమికి పట్టా వస్తే ఇక కష్టాలు తొలగినట్లే.
– భూక్యా అచ్చయ్య, పోడు రైతు,
కెప్టెన్బంజర, కామేపల్లి మండలం