తల్లాడ, సెప్టెంబర్ 6: ప్రజా సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసే పలు పార్టీల నాయకులు, ఇతర ప్రజలు టీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. మండలంలోని నూతనకల్ గ్రామంలో పలు పార్టీలకు చెందిన 10 కుటుంబాల వారు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, డీసీఎంఎస్ చైర్మన్ రాయల వెంకటశేషగిరిరావు ఆధ్వర్యంలో మంగళవారం టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ.. అన్ని వర్గాల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం పాటుపడుతోందని అన్నారు. ప్రతి ఇంటికీ రెండు నుంచి మూడు వరకు సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు.
ప్రతిపక్షాలు సైతం అభినందించే స్థాయిలో ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడుతోందని అన్నారు. వివిధ పార్టీలకు చెందిన ప్రజలు, నాయకులు అభివృద్ధికి ఆకర్శితులై సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ పార్టీలో చేరుతున్నారన్నారు. ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరిన ప్రముఖుల్లో గంగిదేవిపాడు సొసైటీ డైరెక్టర్లు గుగులోత్ లక్ష్మీదేవి, గుగులోత్ వాల్యా, మిట్టపల్లి పంచాయతీ వార్డుమెంబర్లు కొండా శ్రీనివాసరావు, గుగులోత్ వాలీ, గోపాలరావు, రాములు, కృష్ణ, జెర్పుల చిన్ననాగులు, సీతారాములు, కృష్ణయ్యకు చెందిన కుటుంబాల వారు ఉన్నారు. టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు దొడ్డా శ్రీనివాసరావు, రెడ్డెం వీరమోహన్రెడ్డి, దుగ్గిదేవర వెంకట్లాల్, దూపాటి భద్రరాజు, అయిలూరి ప్రదీప్రెడ్డి, తూము శ్రీనివాసరావు, శీలం కోటారెడ్డి, తూము వీరభద్రరావు, నాయుడు శ్రీనివాసరావు, శెట్టిపల్లి లక్ష్మణరావు, బద్ధం కోటిరెడ్డి, మువ్వా మురళి, దగ్గుల శ్రీనివాసరెడ్డి, కేతినేని చలపతిరావు, ఆదూరి వెంకటేశ్వర్లు, పోతురాజు వెంకటయ్య, అయిలూరి శివారెడ్డి పాల్గొన్నారు.
రైతులకు పంట రుణాల పంపిణీ..
వ్యవసాయ బోర్లకు మీటర్లు బిగించాలని చూస్తున్న కేంద్రానికి తెలంగాణ రైతులు తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. మండలంలోని గంగిదేవిపాడు సొసైటీలో సొసైటీ అధ్యక్షుడు, డీసీఎంఎస్ చైర్మన్ రాయల వెంకటశేషగిరిరావు ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పాల్గొని సొసైటీ రైతులకు రూ.70 లక్షల పంట రుణాల చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో కేంద్రానికి వ్యతిరేకంగా 23 రాష్ర్టాల రైతులు ఏకమై రైతుల సమస్యలపై చర్చించినట్లు తెలిపారు. హక్కులను కాపాడుకోవడం కోసం రైతులు సంఘటితంగా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. గంగిదేవిపాడు సొసైటీ ఆదర్శంగా నిలిచిందని, 140 మంది రైతులకు రూ.70 లక్షల రుణాలు అందించడం అభినందనీయమని అన్నారు. ఈ నెల 8న మండలంలోని 10 గ్రామాల్లో లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు.