భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం బొజ్జాయిగూడెంలో బుధవారం జరిగే ప్రజా ఆశీర్వాద సభకు గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ భద్రాద్రి జిల్లాలో పాల్గొనే తొలిసభ కావడంతో విజయవంతం చేసేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్తోపాటు మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత ఏర్పాట్లను పరిశీలించారు. ఇల్లెందు నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పది రోజులుగా సీఎం సభను విజయవంతం చేసేందుకు దగ్గరుండి ఏర్పాట్లు చేశారు. ఇల్లెందు ఎమ్మెల్యే అభ్యర్థి బానోత్ హరిప్రియానాయక్ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేయడంతోపాటు సీఎం సభకు జనం భారీగా తరలిరావాలని కోరుతున్నారు.
సీఎం కేసీఆర్ ఎన్నికల సభకు ఇల్లెందు కార్మిక ప్రాంతం గులాబీమయమైంది. సీఎం రాక కోసం టేకులపల్లి నుంచి ఇల్లెందు వరకు గులాబీ జెండాలతో స్వాగత బ్యానర్లను ఏర్పాటు చేశారు. ఇల్లెందు సమీపంలోని 30 ఎకరాల స్థలంలో సభాస్థలితోపాటు హెలిపాడ్ ఏర్పాటు చేశారు. సభకు వాహనాలతో వచ్చే నాయకులు, ప్రజలు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పక్కనే పార్కింగ్ స్థలాలను కేటాయించారు. సింగరేణి కార్మికులు, టీబీజీకేఎస్ నాయకులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు ఇల్లెందును గులాబీమయం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు. మంగళవారం ఇల్లెందు సభా స్థలానికి చేరుకున్న ఆమె నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారు. జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ నిర్వహించే తొలిసభ కావడంతో భారీగా జనసమీకరణ చేయాలని సూచించారు. ఆమె వెంట మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, మహబూబాబాద్ జడ్పీ చైర్మన్ బిందు, ఎమ్మెల్యే హరిప్రియ ఉన్నారు.
సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు ప్రజలు భారీగా తరలిరావాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కోరారు. మంగళవారం ఇల్లెందు సీఎం సభావేదిక వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించిన ఆయన ముఖ్య నాయకులు, కార్యకర్తలతోపాటు ఎమ్మెల్యేతో కలిసి సమీక్షించారు. ఇల్లెందు గడ్డ బీఆర్ఎస్ అడ్డా అని, ఎవరు ఎన్ని కుతంత్రాలు చేసినా ఇక్కడ ఎగిరేది గులాబీ జెండానే అని అన్నారు. సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సాధించడం పక్కా అని, సర్వేలన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయని అన్నారు. దీనిని ఓర్వలేని నాయకులు పిచ్చికూతలు కూస్తున్నారని, వాటిని పట్టించుకోవద్దన్నారు. సభకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతారని తెలిపారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్
ఇల్లెందు, అక్టోబర్ 31 : ఇల్లెందులో బుధవారం నిర్వహించనున్న సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ చరిత్రలో నిలిచిపోయేలా ఉంటుందని, సీఎం కేసీఆర్కు భారీగా స్వాగతం పలికేందుకు ఇల్లెందు ప్రజలు సిద్ధంగా ఉన్నారని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్ అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాటాడుతూ నియోజకవర్గం నలుమూలల నుంచి సభకు ప్రజలు తరలిరానున్నారన్నారు. సుమారు లక్ష మంది సభకు హాజరవుతారని అంచనా వేస్తున్నామన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. తాగునీరు, షామియానాలు, కుర్చీలు, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా పటిష్ఠమైన ఏర్పాట్లు చేశామన్నారు.
ఇల్లెందు, అక్టోబర్ 31 : వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ మళ్లీ సీఎం అయితేనే అభివృద్ధి, సంక్షేమ పథకాలు నిర్విరామంగా కొనసాగుతాయని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మంగళవారం ఇల్లెందు మండలం బొజ్జాయిగూడెం సమీపంలో ప్రజా ఆశీర్వాద సభా ఏర్పాట్లను ఎమ్మెల్యే, ఎంపీలతో కలిసి ఆమె పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సభను జయప్రదం చేయడానికి నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 75 వేల మంది ప్రజలు తరలిరానున్నారని తెలిపారు. కాంగ్రెస్ పరిపాలనలో పింఛన్ రూ.200 ఇస్తే.. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.2,016 చొప్పున ఇస్తున్నదన్నారు. ఎన్నికలు అనేసరికి అనేక మంది మీ దగ్గరకు వస్తారని, మీకు మేలు చేసింది ఎవరో ఆలోచించి ఓటు వేయాలని కోరారు. దుబ్బాక అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిపై జరిగిన దాడిని ప్రజలు, ప్రజాస్వామికవాదులు ఖండించాలని కోరారు. ఎమ్మెల్యే హరిప్రియను మరోసారి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం మంత్రి సత్యవతి రాథోడ్ జన్మదినాన్ని పురస్కరించుకొని వేదిపై కేక్ కట్చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, మాలోత్ కవిత, ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ, జడ్పీ చైర్ పర్సన్ అంగోత్ బిందు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్ జానీపాషా, బీఆర్ఎస్ నాయకులు సిలివేరు సత్యనారాయణ, మూల మధుకర్రెడ్డి, మెట్ల కృష్ణ, నవీన్, వారా రవి, కిరణ్, కటకం పద్మావతి, ఘాజీ, గిన్నారపు రాజేష్, సనా రాజేష్ తదితరులు పాల్గొన్నారు.