ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని కల్లూరులో బుధవారం బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సూపర్ సక్సెస్ అయ్యింది. సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం వినాలనే ఆతృతతో వివిధ గ్రామాలు, ప్రాంతాల నుంచి ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తండోపతండాలుగా తరలిరావడంతో సభా ప్రాంగణం జాతరను తలపించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయలతో అన్ని రంగాల్లో జరిగిన నియోజకవర్గ అభివృద్ధి, వెంటపడి పని చేయించుకునే ఎమ్మెల్యే సండ్ర పనితీరును మెచ్చుకుంటూ సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగానికి ప్రజలు హర్షధ్వానాలు ప్రకటించారు. చప్పట్లు, ఈలలు, కేరింతలు కొడుతూ మద్దతు పలికారు. సీఎం కేసీఆర్ రాక సందర్భంగా కల్లూరు ప్రాంతమంతా గులాబీ రంగు జెండాలు, ఫ్లెక్సీలు, కటౌట్లతో నిండిపోయింది. ఎటుచూసినా జన సందడే కనిపించడంతో పండుగ వాతావరణం కనిపించింది.