తాండూర్, ఏప్రిల్ 15 : సీఎం కేసీఆర్.. సింగరేణి కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేశారు. వారికి ఇచ్చిన హామీలతో పాటు అడుగకుండానే అనేక హామీలను నెరవేర్చారు. స్పెషల్ ఇంక్రిమెంట్ల అమలు, మెడికల్ బోర్డు ద్వారా కారుణ్య నియామకాలు, ఏసీ క్వార్టర్లు, ఇండ్లు నిర్మించుకున్న వారికి రూ. 10 లక్షల రుణంపై వడ్డీమాఫీ, లాభాల్లో 28 శాతం వాట, కారుణ్య నియామకాల్లో పైైళ్లెన, విడాకులు పొందిన బిడ్డలకు అవకాశం, రూ.8 లక్షల్లోపు ఆదాయ పరిమితి గలవారికి 10 శాతం రిజర్వేషన్లు వర్తింపు.. ఇలా అనేక హక్కులు కల్పించారు. అధికారం చేపట్టినప్పటి నుంచి గని కార్మికులపై అమితమైన ప్రేమను చూపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచి మరోసారి అభిమానాన్ని చాటారు. రాష్ట్ర అవతరణ అనంతరం కోల్ఇండియాలో లేనివిధంగా సింగరేణి కార్మికులకు అనేక హక్కులు కల్పించారు. 2021 నుంచే వయోపరిమితి పెంపు అమలవుతుండగా, 43,899 మందికి లబ్ధిచేకూరుతున్నది. కాగా, ఉద్యోగులు, కార్మికుల్లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
రిటైర్మెంట్ వయస్సు పెంపునకు ఆమోదం..
రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకువెళ్తున్నది. అందులో భాగంగా ఉద్యోగులకు వయోపరిమితి పెంచింది. ఈ మేరకు 2021 మార్చిలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు విరమణ వయస్సు 58 నుంచి 61 ఏండ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే క్రమంలో సింగరేణి కార్మికులకు కూడా వయోపరిమితి పెంచాలని గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత, అధ్యక్షుడు వెంకట్రావ్, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య, కోల్బెల్ట్ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. అందుకు వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి, సింగరేణి ఉద్యోగులు, కార్మికులకూ అమలుచేయాలని యాజమాన్యాన్ని ఆదేశించారు. అదే ఏడాది జూలై 20న సీఎం కేసీఆర్ సింగరేణి ప్రాంత ప్రతినిధులు, సంస్థ చైర్మన్ శ్రీధర్తో సమీక్షా సమావేశం నిర్వహించారు. వయోపరిమితి పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అదే నెల 26న హైదరాబాద్లోని సింగరేణి భవన్లో 557వ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో సింగరేణి అధికారులు, కార్మికుల ఉద్యోగ విరమణ వయస్సును 61కి పెంచుతూ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే 2021, మార్చి 31ని కటాఫ్ తేదీగా నిర్ణయించారు.
43,899 మందికి లబ్ధి..
సీఎం కేసీఆర్ నిర్ణయంతో 43,899 మంది కార్మికులు, అధికారులకు లబ్ధి చేకూరుతున్నది. గతంలో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం రిటైర్డ్ అయిన కార్మికులు సైతం తిరిగి విధుల్లోకి వచ్చారు. అలా సింగరేణి వ్యాప్తంగా 2,200 మంది వరకు రిటైర్డ్ అయిన వారు కూడా తిరిగి ఉద్యోగాల్లో చేరారు. అలాగే రిటైర్డ్ అయిన కొందరు కార్మికులు సింగరేణి క్వార్టర్లను ఖాళీ చేసి, తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో వారు కూడా తిరిగి విధుల్లో చేరడం గమనార్హం. దీంతో సింగరేణి కార్మికుల కుటుంబాల్లో ఆనందం మిన్నంటింది. చాలా మంది కార్మికులు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేశారు. కార్మికులు అడిగినవే కాకుండా, అడగనవి కూడా ఇచ్చేది ముఖ్యమంత్రి కేసీఆర్ అని కార్మికులు ముక్తకంఠంతో చెబుతున్నారు.
కార్మికుల మనసెరిగిన సీఎం..
అమ్మ అయినా అడిగితేనే అన్నం పెడుతుంది అంటారు. కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ అడుగకుండానే అన్నీ ఇస్తున్నారు. గతంలో కార్మికులను ఎవరూ పట్టించుకునే వారు కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ సార్ కార్మికులపై ప్రత్యేక దృష్టిపెట్టి వారి సంక్షేమానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వయోపరిమితి పెంపు విషయంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం వల్ల ఎంతో మంది కార్మికులకు మేలు కలుగుతుంది. కేసీఆర్ సార్కు కార్మికలోకం రుణపడి ఉంటుంది.
– మల్రాజు శ్రీనివాసరావు, బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు, టీబీజీకేఎస్ (తాండూర్)
అడగకముందే అన్నీ ఇస్తున్నారు..
సింగరేణి కార్మికుల సంక్షేమం విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు ఇంతకుముందు ఎవరూ తీసుకోలేదు. ఇక్కడ నుంచి అన్నీ తీసుకెళ్లినవారే తప్ప, సింగరేణికి చేసిందేమీలేదు. కానీ మనసున్న ఈ ముఖ్యమంత్రి మాత్రం మాకు ఎన్నో రకాలుగా మేలు చేస్తున్నారు. కార్మికుల వయోపరిమితి పెంపు వల్ల వారికి ఎంతో మేలు కలుగుతుంది. సింగరేణి కార్మికులు ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటారు. రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్న వారి అనుభవాలతో ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించవచ్చు.
– దరావత్ మంగీలాల్, కార్పొరేట్ చర్చల ప్రతినిధి, టీబీజీకేఎస్ (తాండూర్)
అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు..
కార్మికుల వయో పరిమితి పెంపు అనేది నిజంగా హర్షనీయం. నేను బెల్లంపల్లి ఏరియా ఖైరిగూడ ఓసీపీ గనిలో ఈపీ ఆపరేటర్గా పనిచేస్తున్నా. 2022 జూన్లో రిటైర్డ్ కావాల్సి ఉంది. కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ తీసుకున్న నిర్ణయంతో నేను ఈ ఏడాది జూన్ 30 వరకు పనిచేసే అవకాశం కల్గింది. దీంతో నాకు ఆర్థికంగా ఎంతో కలిసివస్తుంది. గతంలో కార్మికులను ఎవరూ పట్టించుకునే వారుకాదు. కానీ కేసీఆర్ సార్ ప్రత్యేక దృష్టిపెట్టి మరీ మాకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు.
– జీ ప్రభాకర్, ఈపీ ఆపరేటర్, ఖైరిగూడ ఓసీపీ, (తాండూర్)
చాలా సంతోషంగా ఉంది..
వయోపరిమితి పెంపు విషయంపై సీఎం కేసీఆర్ సార్ స్పష్టత ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. రిటైర్డయిన వాళ్లను సైతం తిరిగి విధుల్లో తీసుకోవడమనేది గతంలో ఎప్పుడూ లేదు. నేను 2022 ఆగస్టులో విరమణ పొందాల్సి ఉంది. కానీ, కేసీఆర్ సార్ తీసుకున్న నిర్ణయంతో నా పదవీ కాలం ఈ ఏడాది ఆగస్టు వరకు పెరిగింది. ఆర్థికంగా అభివృద్ధి చెందేదుకు అవకాశం కలిగింది. విరమణ చేయాలనే బాధలో ఉన్న మాకు సర్వీసును పెంచుతున్నట్లు తెలపడం చాలా సంతోషాన్నిచ్చింది.
– దన్నమనేని నర్సింగరావు, ఈపీ ఆపరేటర్, ఖైరిగూడ ఓసీపీ (తాండూర్)