‘ఇల్లెందు నియోజకవర్గం ఉద్యమాల పురిటిగడ్డ. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఏం చేసిందని కొందరు అంటున్నారు.. ఏం చేసిందో మీ అందరికీ తెలుసు. పది హామీలిచ్చి వంద పనులు చేశాం. రైతుబంధు, దళితబంధు, రైతుబీమా, మిషన్ భగీరథ వంటి పథకాలను చెప్పకుండానే చేశాం. కొత్తగా వచ్చిన రాష్ర్టాన్ని దారిలో పెట్టిన పార్టీ బీఆర్ఎస్. తెలంగాణ ఏర్పడక ముందు ఎన్నో బాధలు అనుభవించాం. ఇప్పుడు మంచి పాలనలో వాటి నుంచి విముక్తి పొందాం. చీకటి రాత్రులు అనుభవించిన తెలంగాణలో 24 గంటల కరెంటు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే’ అని ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం బొజ్జాయిగూడెంలో బుధవారం జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు.
‘గతంలో ఏమాత్రం అభివృద్ధి చెందని ఇల్లెందు నియోజకవర్గం కోసం ప్రతిసారి నా వద్దకు వచ్చి రోడ్లకు నిధులు మంజూరు చేయాలని కోరారు. ఇల్లెందు మున్సిపాలిటీకి రూ.400 కోట్ల నిధులు ఇచ్చాం. పోడు రైతుల ఇబ్బందుల గురించి చెబితే.. 45 వేల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చాం. ఇల్లెందు ఎమ్మెల్యే విద్యావంతురాలు, చరిత్ర కలిగిన నాయకురాలు. ఆమె తన ఇంటి పనికోసం అడగడం లేదు.. ఇల్లెందు ప్రజల కోసం అడుగుతున్నారు. నా బిడ్డ అడిగిన తర్వాత కాదంటానా.. కొమరారం, బోడు గ్రామాలను మండలాలుగా చేస్తాం. వచ్చే ఎన్నికల్లో ఇల్లెందు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న హరిప్రియను భారీ మెజార్టీతో గెలిపించాలి’.
భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ) ఇల్లెందు నియోజకవర్గం ఉద్యమాల పురిటిగడ్డ అని ముఖ్యమంతి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. ఇక్కడి నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న తన బిడ్డలాంటి హరిప్రియను గెలిపించాలని పిలుపునిచ్చారు. ‘ఎన్నికలు వస్తాయి. పోతాయి. అవి జరిగేది ఖాయం. మిమ్మల్ని ఒకటే ప్రార్థిస్తున్నా. ప్రజలు ఇంకా పరిణితి చెందాలి. ఓటు వేసేటప్పుడు ఆలోచించాలి. మంచి ఆలోచనతో ఓటు వేస్తే మంచి పాలన మన దగ్గరకు వ స్తుంది. కేసీఆర్ చెప్పిన మాటల గురించి గ్రామాల్లో చర్చ పెట్టండి.’ అని అ న్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం బొజ్జాయిగూడెంలో బుధవారం జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయ న మాట్లాడారు. మంచి ఎమ్మెల్యేను గెలిపిస్తే మంచి ప్రభుత్వం వస్తుందని అన్నారు. ఓటు మీచేతిలో ఉందని, ఆగం కావద్దని విజ్ఞప్తి చేశారు. సన్నాసులకు ఓట్లు వేయొద్దని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏంచేసిందని కొంతమంది అంటున్నారని, మరి ఏం చేసిందో మీ అందరికీ తెలుసునని అన్నారు. పది హమీలిచ్చి వంద పనులు చేశామని గుర్తుచేశారు. రైతుబంధు, దళితబంధు, రైతుబీమా, మిషన్ భగీరథ వంటి పథకాలను చెప్పకుండానే చేశామని వివరించారు. కొత్తగా వచ్చిన రాష్ర్టాన్ని దారిలో పెట్టిన పార్టీ టీఆర్ఎస్ అని అన్నారు. తెలంగాణ ఏర్పడకముందు ఎన్నో బాధలు అనుభవించామని గుర్తుచేశారు. ఇప్పుడు మంచి పాలనలో వాటి నుంచి విముక్తి పొందామని అన్నారు. చీకటి రాత్రులు అనుభవించిన తెలంగాణలో 24 గంటల కరెంటు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.
తలకాయ తెగిపడ్డా కరెంటు
కరెంటుపై ప్రధాని మోదీ పిచ్చిమాటలు మాట్లాడుతున్నాడని సీఎం కేసీఆర్ విమర్శించారు. రైతుల వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలంటూ ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. అది ఎంతవరకూ సమంజసమో మోదీయే చెప్పాలని ప్రశ్నించారు. అందుకే తన తలతెగిపడ్డా రైతుల మోటర్లకు మీటర్ల పెట్టనని స్పష్టం చేశానని అన్నారు. ఒకనాడు నీళ్లులేక బీళ్లుగా ఉన్న తెలంగాణలో ఇప్పుడిప్పుడే రైతులు ముఖాలు పచ్చగా కన్పిస్తున్నాయని అన్నారు. ఇలాంటి సమయంలో రైతులకు రైతుబంధు ఇచ్చి ఆదుకున్నానని గుర్తుచేశారు. అందుకే రాష్ట్రంలో 3 కోట్ల మిలియన్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందని వివరించారు. త్వరలో సీతారామ ప్రాజెక్టు పూర్తయితే మరో కోటి టన్నుల ధాన్యం దిగుబడి కూడా వస్తుందని అన్నారు.
ఎమ్మెల్యే హరిప్రియకు ఒక చరిత్ర ఉందని, ఈ నియోజకవర్గంలో 45 వేల ఎకరాలకు పోడుపట్టాలు ఇప్పించారని అన్నారు. విద్యావంతురాలు అయిన నా బిడ్డలాంటి హరిప్రియ.. ఇల్లెందును అన్ని విధాలా అభివృద్ధి చేశారని అన్నారు. ఈ ఎన్నికల్లో ఆమెను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. గతంలో భూమి ఉంటే పిల్లనిచ్చేవాళ్లు కాదని, ఇప్పుడు మీకెంత పొలముందని అడుగుతున్నారని అన్నారు. తెలంగాణ తెచ్చిన ఘనత ఇదేనని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ గేట్లు తాకనివ్వబోమంటూ కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారని అన్నారు. కానీ అసెంబ్లీ గేట్లు తాకనిచ్చేది వాళ్లు కాదని, మీరేనని ప్రజలను ఉద్దేశించి అన్నారు. ఓట్లు వేసేది మీరని, భవిష్యత్ మీ చేతుల్లోనే ఉందని అన్నారు. అభివృద్ధిని చూసి ఓట్లు వెయ్యాలని అన్నారు. మళ్లీ మనమే గెలవబోతున్నామని, హరిప్రియ చెప్పిన విధంగా కొమరారాన్ని మండలం చేసుకుందామని అన్నారు. గెలిచాక మళ్లీ వచ్చి మీ మధ్యలోనే ఉండి మరోసారి మాట్లాడుకుందామని అన్నారు.
ఇల్లెందు, నవంబర్ 1: ఏజెన్సీలో పోడు భూములకు పట్టాలిచ్చిన మహానేత సీఎం కేసీఆర్ అని ఇల్లెందు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి హరిప్రియానాయక్ పేర్కొన్నారు. గిరిజనులను పోడు భూములకు యజమానులను చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. మండలంలోని బొజ్జాయిగూడెంలో బుధవారం ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆమె మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో ఇల్లెందు నియోజకవర్గంలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి పనులు జరిగాయని, సంక్షేమ పథకాలు అమలయ్యాయని అన్నారు. కేవలం అభివృద్ధి పనులకే రూ.3001 కోట్లు వెచ్చించినట్లు చెప్పారు. ఇల్లెందు వాసుల ఆరు దశాబ్దాల కల అయిన బస్ డిపోను కూడా ఏర్పాటు చేశారని, ప్రభుత్వ వైద్యశాలను 100 బెడ్ల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేశారని, డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. కేసీఆర్ పథకాలు అందని గడప లేదని స్పష్టం చేశారు. సీతారామ ప్రాజెక్టును సాధించి పెట్టిన కేసీఆర్కు నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. పూర్తి ఏజెన్సీ ప్రాంతాలనైన కొమరారం, బోడులను మండలాలుగా, ఇల్లెందును రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని కోరారు.
బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయకుండా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తే.. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నోరు మెదపకుండా ఈ ప్రాంతానికి అన్యాయం చేసిందని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో మీ ఆడబిడ్డగా మీముందుకు వచ్చిన తనను నియోజకవర్గ ప్రజలు నిండు మనసుతో దీవించాలని కోరారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ స్పందిస్తూ.. ఎమ్మెల్యే హరిప్రియ తన బిడ్డలాంటిదని అన్నారు. వచ్చేది మన ప్రభుత్వమే గనుక.. ఆమె వివరించిన ప్రజా సమస్యలను వచ్చే ఏడాది మార్చి తర్వాత పరిష్కాస్తానని హామీ ఇస్తున్నానని అన్నారు. మంత్రులు పువ్వాడ అజయ్కుమార్, సత్యవతి రాథోడ్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, మాలోత్ కవిత, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ రామ్మోహన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, వనమా వెంకటేశ్వరరావు, మహబుబాబాద్ జడ్పీ చైర్మన్ బిందు, బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు కోనేరు చిన్ని, దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, జానీపాషా, రంగనాథ్, నాదేండ్డ శ్రీనివాసరెడ్డి, వరప్రసాద్, శీలం రమేశ్, హన్మంతరావు, తాతా గణేశ్, లక్ష్మణ్నాయక్, జేకే శ్రీను, కుంటా నవాబ్ పాల్గొన్నారు.