కరుణామయుడు ఏసు ప్రభువు జన్మదినం సందర్భంగా క్రిస్మస్ పండుగను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా క్రైస్తవ విశ్వాసులు ఆదివారం అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఈ పండుగకు సర్వాంగ సుందరంగా ముస్తాబైన చర్చీలు, క్రైస్తవ మందిరాల్లో విశ్వాసులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయా చర్చీల్లో దైవజనులు భక్తులకు క్రీస్తు సందేశం వినిపించారు. క్రీస్తు బోధనలు అనుసరణీయమని, ఆయన చూపిన శాంతి మార్గం ఆచరణీయమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ప్రేమ, జాలి, దయా గుణాలు కలిగి ఉండాలని ఆకాంక్షించారు. కాగా, క్రీస్తు జన్మదినం సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని సీఎస్ఐ, ఆర్సీఎం, గుడ్షెపర్డ్, హోలిట్రినిటీ సహా వివిధ చర్చీలన్నీ విశ్వాసులతో కిటకిటలాడాయి. ఖమ్మం చర్చి కాంపౌండ్లోని సీఎస్ఐ చర్చిలో రాష్ట రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీస్తు బోధనలు సర్వ మానవాళికీ స్ఫూర్తిదాయకమైనవని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే పండుగ క్రిస్మస్ మాత్రమేనని గుర్తుచేశారు.
క్రీస్తు జన్మదినం సందర్భంగా కొత్తగూడెం జిల్లా కేంద్రం పోస్టాఫీస్ సెంటర్లో ఉన్న సెయింట్ ఆండ్రూస్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న విశ్వాసులు
ఖమ్మం కల్చరల్, డిసెంబర్ 25 : దివి నుంచి భువికి దిగివచ్చిన పరమాత్ముడు, మనుషులందరి రక్షకుడు, పాపాలను పోగొట్టే పరమ పావనుడు, అదృశ్య దేవుని దృశ్యరూపమైన యేసునాథుడికి భక్తజనం ప్రణమిల్లింది. ఆయన జన్మదినం క్రిస్మస్ పండుగను ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా క్రైస్తవులు ఆదివారం అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. క్రిస్మస్ పండుగకు సర్వాంగ సుందరంగా ముస్తాబైన చర్చిలు, క్రైస్తవ మందిరాలు, కాపరుల సంఘాల ఆలయాల్లో పెద్దఎత్తున విశ్వాసులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఖమ్మం నగరంలోని సీఎస్ఐ, ఆర్సీఎం, గుడ్షెపర్డ్, హోలీట్రినిటి చర్చిలు కిటకిటలాడాయి. ఈ సందర్భంగా ఆయా చర్చిల్లో మత పెద్దలు, పాస్టర్లు యేసు బోధనలు, శాంతి సందేశాలను వివరించారు. దైవ వాక్యాలు, దైవ సందేశాలు, యేసు బోధనలతో క్రైస్తవ మందిరాలు మార్మోగాయి. వారంరోజులుగా అంతటా సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. యేసు ప్రభువు జన్మదినం పండుగలో ప్రార్థనలు, భక్తిగీతాలతో జిల్లా అంతటా ఆధ్యాత్మిక వాతావరణం చోటుచేసుకుంది.
ఖమ్మం చర్చి కాంపౌండ్లోని అతి పురాతన సీఎస్ఐ చర్చిలో జరిగిన వేడుకలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పాల్గొని క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. యేసుప్రభువు చాటిన ప్రేమ, కరుణ, త్యాగం, శాంతి మార్గాలను ప్రతిఒక్కరూ అనుసరించాలని సూచించారు. యేసు బోధనలు సర్వ మానవాళికి ఆచరణీయమన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుపుకొనే క్రిస్మస్ పండుగను అధికారికంగా నిర్వహించేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమేనన్నారు. ఈ పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని పేద క్రిస్టియన్లకు ప్రభుత్వం కానుకలు, దుస్తులు పంపిణీ చేస్తున్నదన్నారు. క్రిస్టియన్ సోదరుల ఆత్మగౌరవం పెంపొందేలా సీఎం కేసీఆర్ పది కోట్ల రూపాయల వ్యయంతో క్రిస్టియన్ భవనం నిర్మించనున్నారని తెలిపారు. క్రిస్టియన్ యువత, విద్యార్థులు, మహిళలకు ప్రోత్సాహకాలు, ఉపాధి కల్పిస్తూ క్రైస్తవ సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ, ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న, రెవరెండ్ విశ్వం, చర్చి కార్యదర్శి సుధాకర్, కార్పొరేటర్లు బిజి క్లెమెంట్, పల్లారోజ్లీనా, కమిటీ సభ్యులు కిశోర్, పల్లా శేఖర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి అజయ్ ప్రార్థన చేయగా, మత పెద్దలు ఆయనను ఆశీర్వదించారు. నగరంలోని వైరా రోడ్డు ఆర్సీఎం చర్చిలో చర్చి ఫాదర్లు ఆగస్టీన్, జయంత్ క్రిస్మస్ కేక్ను కట్ చేసి దైవ సందేశాన్ని వినిపించారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ వేడుకలో పాల్గొని ప్రార్థనలు చేశారు. శాంతిదూత, కరుణామయుడు యేసు ప్రభువు చాటిచెప్పిన విలువలను ప్రతి ఒక్కరూ అనుసరించాలన్నారు. నాయుడుపేట కరుణగిరి చర్చిలో ఆర్సీఎం బిషప్ ప్రత్యేక దైవ సందేశాన్ని వివరించారు. కరుణగిరి డైరెక్టర్ మాథ్యూ వరప్రసాదరాజు పర్యవేక్షణలో యేసుక్రీస్తు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మాంట్ఫోర్ట్ పాఠశాలలోని సెయింట్ జోసెఫ్ ఆర్సీఎం చర్చిలో ఫాదర్ రెవరెండ్ లాజర్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గుడ్షెపర్డ్ చర్చిలో పాస్టర్ రెవరెండ్ సత్యపాల్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. హోలిట్రినిటీ చర్చిలో పాస్టర్ మోహన్రావు క్రిస్మస్ సందేశాన్ని వినిపించారు. ఇందిరానగర్ కాలనీ సీఎస్ఐ చర్చి, పార్శీబంధంలో యేసు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.