కారేపల్లి, ఏప్రిల్ 16 : గతంలో మిర్చి పంట సాగు చేయాలంటే రైతులు భయపడేవారు. పంట పండించడానికి నీరు ఉంటుందా.. చీడపీడలు ఆశించి పంటను దెబ్బతీస్తాయా.. తీరా పంట చేతకొచ్చే సమయానికి మద్దతు ధర ఉంటుందా.. అనే సంశయంలో పడేవారు. అలాంటిది తెలంగాణ ప్రభుత్వం రైతులకు ‘మద్దతు’గా నిలిచింది. దీంతో మండలంలో ఎర్ర బంగారం(మిర్చి) సాగు చేసిన రైతులు ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్త చేస్తున్నారు. మండలంలో ఈ ఏడాది సుమారు 12 వేల ఎకరాల్లో రైతులు మిర్చి పంట సాగు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ లెక్కలు చెబుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఎక్కువ మంది మిరప సాగుపై మక్కువ చూపారు.
తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందేందుకు ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ, హార్టికల్చర్ అధికారుల సలహాలు, సూచనలు తీసుకుంటూ ఆధునిక పద్ధతుల్లో పంట సాగు చేశారు. నీటి ఆధారిత పంట కావడంతో వర్షాలు తక్కువగా ఉన్నప్పటికీ వ్యవసాయానికి ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన ఉచిత విద్యుత్ను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటున్నారు. అలాగే సబ్సిడీపై అందిస్తున్న వ్యవసాయ పరికరాలు, డ్రిప్ ఇరిగేషన్, మోటార్ పంపులను పొంది లాభాల బాటలో పయనిస్తున్నారు. ఎకరాకు రూ.లక్ష పెట్టుబడితో 30 నుంచి 40 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్న రైతులు తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న ధరతో రూ.2 లక్షల వరకు ఆర్జిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈసారి వాతావరణం సానుకూలించి ఏకకాలంలో పంట చేతికి రావటంతో కూలీల కొరత ఏర్పడింది. దీంతో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ తదితర రాష్ర్టాల నుంచి తెలంగాణ రాష్ర్టానికి వచ్చిన వందలాది మంది వలస కూలీలకు ఉపాధి కల్పిస్తున్నారు.