గత ప్రభుత్వాలు వ్యవసాయాన్ని దండగ చేసిన కారణంగా ఉన్న పొలాలను కౌలుకు ఇచ్చి ఉపాధి కోసం వలస పోయిన రైతులందరూ క్రమంగా మళ్లీ ఊళ్లకు చేరుకున్నారు. సాగు రంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తూ వ్యవసాయాన్ని పండుగ చేస్తున్న తరుణంలో వారంతా మళ్లీ పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. మొన్నటి వరకూ తమ పొలాలను కౌలుకు ఇచ్చిన పద్ధతులకు స్వస్తి పలికి.. తమ భూములను తామే సాగుచేసుకుంటున్నారు. ఇందులో అధిక భాగం యువ రైతులు ఉన్నారు. ఫలితంగా కామేపల్లి మండలంలో ఏటికేడు సాగు విస్తీర్ణం పెరుగుతోంది.
-కామేపల్లి, ఏప్రిల్ 15
కామేపల్లి, ఏప్రిల్ 15 : పంటల కోసం చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసు కున్న రోజుల నుంచి అదే సాగును సంబురంగా చేసి ఆడ పిల్లల వివాహాలను వైభవంగా చేసి చూపిన రోజులు తెలంగాణ రైతుల కుటుంబాల్లో ఈ ఎనిమిదేళ్లలోనే సాధ్యమయ్యాయంటే అతిశయోక్తి కాదు. సమైక్యాంధ్ర పాలకులు వ్యవసాయాన్ని దండగంటే.. సీఎం కేసీఆర్ మాత్రం దానిని పండుగ చేసి చూపించారు. ముఖ్యంగా అన్నదాతలను సాగువైపు మళ్లించిన గొప్ప పథకంగా రైతుబంధు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది. పంటల పెట్టుబడి సాయం కింద వానకాలం, యాసంగి కాలాల్లో ఒక్కో సీజన్కు రూ.5 వేల చొప్పున ఎకరానికి రూ.10 వేల సాయం అందుతుండడంతో అన్నదాతలందరూ మేడి పట్టుకొని సాగులోకి దిగడం ప్రారంభించారు. వనరులు సమకూరడం, సౌకర్యాలు అందుబాటులోకి రావడం, సబ్సిడీలు, మద్దతు ధరలు వంటివన్నీ అన్నదాతకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. ఫలితంగా సాగంతా సంబురంగా మారింది.
ఒకప్పటి దుస్థితి..
పంటల సాగుకు పెట్టుబడి సాయం లేక, బయటికెళ్తే సరైన సమయంలో అప్పులు దొరకక, ఎన్నో తిప్పలు పడి సాగులోకి దిగితే సమయానికి కరెంటు రాక, అయినా ధైర్యం చేసి చెమట చుక్కలు చిందిస్తే.. పిడికెడంత పంట కూడా చేతికొచ్చి స్థితి లేని రోజులవి. అయినా గుండె దిటవు చేసుకొని ఆ కాసింత పంటను మార్కెట్కు తీసుకెళ్తే ధరలు తగ్గాయన్న పేరిట దళారులు దగా చేస్తే.. పుట్టెడు దుఖ:తో కండువా భుజాన వేసుకొని ఆకలితో లాగుతున్న పేగులను పొదివి పట్టుకొని ఇంటిముఖం పట్టిన రోజులవి. ఇక ఈ వ్యవసాయం మన వల్లకాదని కాడిని కిందకు దించి కమతాన్ని కౌలుకిచ్చి కడుపు నింపుకునేందుకు కాలిబాటన వలస వెళ్లిన రోజులవి. అవే.. తెలంగాణ ఆవిర్భావానికి ముందు రోజులు. సీమాంధ్ర నేతలు పాలించిన రోజులు.
నేటి పరిస్థితి.
సీజన్కు ముందే పంటల సాగుకు పెట్టుబడి. ఆ వెంటనే సహకార సంఘాల్లో రాయితీ విత్తనాలు, ఎరువులు. విత్తనాలు మొలకెత్తాయో లేదో తడి అందించేందుకు 24 గంటలూ ఉచిత వ్యవసాయ విద్యుత్. మరో వైపు చెరువులు, కుంటల్లో పుష్కలంగా సాగునీరు. పంటలు కోసేందుకు సబ్సిడీపై యంత్రాలు, కోతల కాలం ముగుస్తుండగానే కల్లాల్లోనే సిద్ధమయ్యే కొనుగోలు కేంద్రాలు. అక్కడికక్కడే కొనుగోలు చేసుకొని వెళ్లే అధికారులు. ఆ వెంటనే బ్యాంకు ఖాతాల్లోకి ధాన్యం/ పంటల సొమ్ములు. అవి చేతికందగానే అన్నదాతల మోముల్లో చెరగని చిరునవ్వులు. ఇవీ.. సీఎం కేసీఆర్ పాలనలోని రోజులు.
ఫలితం..
ఉన్న చేలను కౌలుకు ఇచ్చుకొని ప్రత్యామ్నాయ ఉపాధి కోసం ఊరు వదిలి వెళ్లే రోజుల నుంచి సొంత ఊళ్లోనే సంబురంగా సాగు పనులు చేసుకునేందుకు తిరిగి వచ్చిన రోజులు ఉద్భవించాయి. ఇందులోనూ అధిక భాగం యువ రైతుల దర్శనాలే. రైతుబంధు, రైతుబీమా నుంచి పంటల కొనుగోళ్లు మద్దతు ధరల వరకూ అన్ని వనరులు, సౌకర్యాలు సమకూర్చిన ఫలితం. వ్యవసాయ రంగంపై సీఎం కేసీఆర్ చూపిన ముందుచూపు ఫలితం.
ప్రైవేటు ఉద్యోగం వదిలి వ్యవసాయం చేస్తున్నా..
నేను ఎంబీఏ చదివి ప్రైవేటు ఉద్యోగం చేసేందుకు ఆంధ్రా వెళ్లా. మాకు ఉన్న వ్యవసాయ భూమిని కౌలుకు ఇచ్చి వ్యవసాయం జోలికి వెళ్లొద్దని అనుకున్నాం. తెలంగాణ ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు, ఉచిత కరెంటు సరఫరా, సాగు నీళ్లు, సబ్సిడీ యంత్రాలు, రాయితీ ఎరువుల, మద్దతు ధరలు వంటివి రైతులను ఎంతగానో ఆదుకుంటున్నాయి. దీంతో వ్యవసాయంపై ఆసక్తి పెరిగింది. ప్రైవేటు ఉద్యోగం వదిలేసి ఇంటికొచ్చి వ్యవసాయం చేస్తున్నా. 8 ఎకరాల్లో మిర్చి, ఒక ఎకరంలో పత్తి సాగు చేస్తున్నా.
-బొగ్గారపు అశోక్, పండితాపురం, యువ రైతు
వ్యవసాయం చేసేందుకు ఇబ్బందులు లేవని..
నాకు మొత్తం 11 ఎకరాల భూమి ఉంది. నేను పండితాపురం విడిచి భూమిని కౌలుకి ఇచ్చి ఖమ్మం వెళ్లి 14 ఏళ్లవుతోంది. గతంలో నేను వ్యవసాయం చేశాను. ఆ సమయంలో కరెంట్ రాక, విత్తనాలు, ఎరువుల లభించక అనేక ఇబ్బందులు పడ్డాను. దీంతో వ్యవసాయం చేయలేక భూమిని కౌలుకు ఇచ్చాను. ఆ సమయంలో చాలా మంది రైతులు కౌలుకు తీసుకునేందుకు కూడా ముందుకు రాలేదు. అయినా తక్కువ ధరలకు కౌలుకు ఇచ్చి వలస వెళ్లాను. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయడంతో వ్యవసాయ రంగ సమస్యలన్నీ తీరిపోయాయి. దీంతో మళ్లీ నాకు వ్యవసాయం చేయాలనే ఆసక్తి కలిగింది. దీంతో తొమ్మిదేళ్ల తరువాత సాగు పనులు ప్రారంభించాను. 3 ఎకరాల్లో పత్తి, 8 ఎకరాల్లో పామాయిల్ సాగు చేస్తున్నా. వనరులు పుష్కలంగా ఉండడంతో పంటల సాగుకు ఎలాంటి ఇబ్బందులూ కలుగడం లేదు.
-ముత్యాల వెంకటేశ్వర్లు, పండితాపురం, రైతు