భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): భద్రాద్రి జిల్లాలో ఇసుక అక్రమ రవాణా దందా మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతున్నది. డబ్బులకు కక్కుర్తి పడిన కొందరు అక్రమార్కులు కృత్రిమ కొరత సృష్టించి, వినియోగదారులకు ఎక్కువ ధరకు ఇసుక విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. పోలీసుల కళ్లు గప్పి ఆంధ్రా నుంచి తెలంగాణకు గుట్టుచప్పుడు కాకుండా ఇసుక తరలిస్తూ పబ్బం గడుపుకొంటున్నారు. బూర్గపహాడ్ మండలంలో ఒక్క బుధవారం అర్ధరాత్రే అక్రమంగా ఇసుక తరలిస్తున్న 17 ఇసుక లారీలను మైనింగ్శాఖ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన మరువక ముందే గురువారం ఉదయం పాల్వంచ మండలం కేశవాపురంలో అధికారులు మరో ఐదు ఇసుక లారీలను పోలీసులు పట్టుకున్నారు. నామమాత్రపు నిఘా పెట్టి, నామమాత్రపు సంఖ్యలో వాహనాలను సీజ్ చేస్తూ యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తుందనే ఆరోపణలు ప్రస్తుతం జిల్లాలో వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం మణుగూరు, పినపాక, చర్ల, దుమ్ముగూడెం, బూర్గంపహాడ్ మండలాల్లోని ఇసుక రీచ్లు మూతపడడంతో జిల్లాలో ఇసుక కొరత ఏర్పడింది. ఒకప్పుడు ఈ రీచ్లు నడిచినపప్పుడు ఒక ట్రక్కు ఇసుక వినియోగదారులకు కేవలం రూ.2 వేలకే లభించేది. ప్రస్తుతం రూ.4 వేలు పెట్టినా ఇసుక దొరకని పరిస్థితి ఏర్పడింది.
పాల్వంచ రూరల్, ఫిబ్రవరి 15: ఇసుకను ఆంధ్రా నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న ఐదు లారీలను పాల్వంచ రూరల్ పోలీసులు గురువారం పట్టుకుని స్టేషన్కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని కేశవాపురం వద్ద పాల్వంచ రూరల్ ఎస్సై శ్రీనివాస్ తన సిబ్బందితో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రా నుంచి ఇసుక లోడుతో వెళుతున్న లారీలు పట్టుబడ్డాయి. ఇసుక రవాణాకు సంబంధించి ఎటువంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో ఐదు లారీలను పాల్వంచ రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు.
భద్రాచలం పట్టణానికి ఒకప్పుడు కూతవేటు దూరంలో ఉన్న గుండాల ప్రాంతం ఉమ్మడి ఖమ్మం పరిధిలో ఉండేది. రాష్ట్ర విభజన తర్వాత ఆ గోదావరి పరీవాహక ప్రాంతం ఆంధ్రాలో విలీనమైంది. అక్కడి గోదావరి తీరం నుంచి ఆంధ్రాకు చెందిన కొందరు కాంట్రాక్టర్లు అక్రమంగా ఇసుక తవ్విస్తున్నారు. భద్రాద్రి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు రోజుకు 40 నుంచి 50 లారీల ద్వారా ఇసుక తరలిస్తున్నారు. ప్రస్తుతం ఒక లారీ లోడ్ ఇసుకకు అక్రమార్కులు సుమారు రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారు. గుండాల నుంచి తెలంగాణకు వచ్చే ఏ ఇసుక లారీ అయినా భద్రాచలం పట్టణంలోని గోదావరి బ్రిడ్జి పైనుంచే రావాలి. పట్టణంలో అనేకచోట్ల చెక్పోస్టులు ఉన్నాయి. అలాగే బ్రిడ్జీపైనా మరో చెక్పోస్ట్ ఉన్నది. అయినప్పటికీ ఇసుక అక్రమ రవాణా దందా కొనసాగుతున్నదంటే నిఘా వ్యవస్థ ఏ మేరకు పనిచేస్తున్నదో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నిఘా వ్యవస్థను పటిష్టపరచాలని, అక్రమార్కుల ఆగడాలను కట్టడి చేయాలని జిల్లావాసులు కోరుతున్నారు.
ఇసుక దందాపై ‘నమస్తే’ గనులశాఖ ఏడీ జైసింగ్ను వివరణ కోరగా.. భద్రాద్రి జిల్లాలో పలుచోట్ల అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలను పట్టుకున్న సంగతి వాస్తవమేనన్నారు. ప్రస్తుతం ఆయా వాహన డ్రైవర్లు పరారీలో ఉన్నారన్నారు. వాహన నంబర్ల ఆధారంగా యజమానులను గుర్తించే పనిలో ఉన్నామన్నారు. ఇసుక అక్రమ రవాణా నిగ్గు తేల్చే పనిలో తమ సిబ్బంది నిమగ్నమయ్యారని సమాధానమిచ్చారు. ఆర్టీవో వేణును వివరణ కోరగా.. మైనింగ్శాఖ అధికారులు అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలను సీజ్ చేశారని తమ దృష్టికి వచ్చిందన్నారు. సదరు వాహనాలకు అనుమతులున్నాయా, డ్రైవర్లు ఓవర్ లోడ్తో ఏమైనా సరకు తరలిస్తున్నారా.. వాహన యజమానుల వద్ద సరైన వాహన పత్రాలు ఉన్నాయా.. లేవా.. అనే అంశాలపై విచారిస్తామన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సరైన పత్రాలు లేకుంటే యజమానులపై చర్యలు తీసుకుంటామని సమాధానమిచ్చారు.
భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు తనిఖీలు ముమ్మరం చేయాలని, అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద 24 గంటలపాటు వాహన తనిఖీలు చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీవోసీ కార్యాలయంలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు చేపట్టాల్సిన చర్యలపై రెవెన్యూ, పోలీస్, అటవీ, మైనింగ్, టీఎస్ఎండీసీ, రవాణా, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులతో మానిటరింగ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మణుగూరు, పినపాక మండలాల్లో వాహన తనిఖీలు చేపట్టేందుకు చెక్పోస్టులు ఏర్పాటు చేయాలన్నారు. అనుమతి ఉన్న ఇసుక రీచ్ల నుంచి మాత్రమే ఇసుక రవాణాకు అనుమతి ఉంటుందని, అనుమతి లేని ప్రాంతాల్లో ఇసుక తీస్తే కఠిన చర్యలు చేపట్టాలని మైనింగ్, టీఎస్ఎండీసీ, రెవెన్యూ, పోలీస్ అధికారులను ఆదేశించారు. వాహనాలను తనిఖీ చేసేందుకు రూట్ మ్యాప్లు రూపొందించడంతోపాటు రూట్ టీములు కూడా ఏర్పాటు చేయాలన్నారు. అక్రమ రవాణా, అధిక లోడు వాహనాలను పట్టుకున్నైట్లెతే సమాచారాన్ని మైనింగ్ అధికారులకు తెలియజేయాలన్నారు. రాత్రి సమయాల్లో నిరంతరాయంగా పటిష్ఠ తనిఖీలు చేపట్టాలన్నారు. సమావేశంలో ఎస్పీ రోహిత్ రాజు, ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్, అటవీ శాఖ అధికారి కిష్టాగౌడ్, అదనపు కలెక్టర్ రాంబాబు, డీఆర్డీవో విద్యాచందన, ఏఎస్పీ పరితోష్ పంకజ్, రవాణా శాఖ అధికారి వేణు, మైనింగ్ ఏడీ జైసింగ్, టీఎస్ఎండీసీ పీవో శ్రీనివాస్, సర్వే ఏడీ కుసుమకుమారి, డీఎస్పీలు పాల్గొన్నారు.