ఖమ్మం ఎడ్యుకేషన్, మార్చి 19 : జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణలో ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనల విషయంలో అలసత్వం వహిస్తే ఎంతటి వారైనా చర్యలు తీసుకునేందుకు వెనుకాడడం లేదు. పరీక్షల తొలిరోజు రూరల్ మండలం ఎదులాపురం కేంద్రంలోకి నిబంధనలకు విరుద్ధంగా కారు తీసుకొచ్చిన ఇన్విజిలేటర్ను విధుల నుంచి తొలగించారు. పరీక్షా కేంద్రాల్లో అమర్చిన సీసీ కెమెరాల ద్వారా ఎవరెవరు వస్తున్నారనే అంశాలను కలెక్టర్ పరిశీలిస్తున్నారు. కాగా.. మంగళవారం పరీక్ష జరిగిన అనంతరం జిల్లా అబ్జర్వర్ మదన్మోహన్, డీఈవో సోమశేఖర శర్మలు పరీక్ష తీరుపై కలెక్టర్ వీపీ గౌతమ్ను కలిసి వివరించారు.
పరీక్షల నిర్వహణ విషయంలో అప్రమత్తంగా లేకపోతే ఇబ్బందులు తప్పవని కలెక్టర్ సూచించినట్లు తెలిసింది. కలెక్టర్ను కలిసిన తర్వాత జిల్లా అబ్జర్వర్, డీఈవో, పరీక్షల విభాగం ఏసీలు సమావేశమయ్యారు. రెండు రోజుల పరీక్షల తీరుపై సమీక్షించారు. అయితే పర్యవేక్షణలో భాగమైన 6 ఫ్లయింగ్ స్కాడ్లలో రెండు బృందాల్లో మార్పులు చేయనున్నారు. ఫ్లయింగ్ స్కాడ్ బృందాల్లోని అధికారుల మార్పుపై ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు కూడా తెలుస్తోంది. దీనిపై బుధవారం నిర్ణయం తీసుకోనున్నారు. మంగళవారం జరిగిన హిందీ పరీక్షలో 16,571 మందికి.. 16,530 మంది హాజరై 41 మంది గైర్హాజరు కాగా.. పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు డీఈవో సోమశేఖర శర్మ తెలిపారు.