ఖమ్మం : ఎమ్మార్పీఎస్ టీఎస్ యువసేన ఆధ్వర్యంలో ఈ నెల పదమూడున చలో ఢిల్లీ మాదిగ లొల్లి అనే కరపత్రాన్ని జాతీయ ఉపాధ్యక్షులు లంకా వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు ప్రతి మాదిగ బిడ్డ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎస్సీలో ఉన్న ఉపకులాలు యాభై తొమ్మిది ఈ ఉప కులాలకు ఏ.బీ.సీ.డీ లుగా వర్గీకరణ చేస్తే న్యాయం జరిగిందని ,సుదీర్ఘంగా ఇరవై ఏడు సంవత్సరాలు పోరాటం చేసినా వర్గీకరణ చేయలేదని, బీజేపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అధికారంలోకి వస్తే వందరోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి.. ఇంతవరకు హామీ నెరవేర్చలేదన్నారు.
ఇప్పటికైనా ఈ శీతాకాలం సమావేశంలో ఇచ్చిన హామీ నెరవేర్చాలని కోరారు. లేనిపక్షంలో మాదిగలంతా ఉద్యమాలు , రాస్తారోకోలు, ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. మాదిగలలో కుడా చదువుకున్న విద్యార్థులు ఉన్నారని వారికి సరైన ఫలాలు అందక కూలిపనులకు పోతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అభి,సందీప్, ఫన్నీ, పండు, గోపి, పవన్, సాయి, వేణు, నాగరాజు, ఎల్లకొండ, నాగరాజు, ముదిగొండ మండల అధ్యక్షులు కొత్తపల్లి నరసింహ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మార్పీఎస్ టీఎస్ ఖమ్మం జిల్లా యువసేన కన్వీనర్ గా పేరెల్లి ప్రవీణ్ కుమార్ ను నియమించారు.