ఖమ్మం, డిసెంబర్ 2: జిల్లా ప్రధాన ఆసుపత్రి అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు సూచించారు. పేదలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఖమ్మంలోని జిల్లా ప్రధాన ఆసుపత్రిలో శుక్రవారం జరిగిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సిబ్బంది మెరుగ్గా పనిచేస్తూ పేదలకు సేవలు అందించాలని సూచించారు. ఎంసీహెచ్ భవనంపై మరో అంతస్తు మంజూరు విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు.
క్యాథ్లాబ్ ద్వారా 15 ఏంజీయో ప్లాస్టీ, 50 ఏంజీయాగ్రామ్, 357 ఆరోగ్యశ్రీ చికిత్సలు చేయాలని సూచించారు. వెల్నెస్, ఆయూష్ కేంద్రాలకు భవనాల నిర్మాణానికి ఆసుపత్రి అవసరాలకు పోను మిగిలిన స్థలం ఉంటే దానిని కేటాయించాలని సూచించారు. ఐపీ, ఓపీ జనరల్ విభాగంలో మాన్యువల్గా జరుగుతున్నట్లు సేవలను ఆన్లైన్లో చేపట్టాలన్నారు. ప్రత్యేక గదులు, ఆరోగ్యశ్రీవార్డు, ఏఎంసీ వార్డు పునర్మినిర్మాణం, మైనర్ ఓటీ ఏర్పాటు , టాయిలెట్ బ్లాకుల మరమ్మతులు, పాత బ్లాకు రూప్ లీకేజీ మరమ్మతులతోపాటు వివిధ విభాగాల అభివృద్ధి గురించి చర్చించారు.
అనంతరం ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం జిల్లాకు వైద్య కళాశాలను, నర్సింగ్ కళాశాలను మంజూరు చేసినట్లు గుర్తుచేశారు. ఆనుబంధ ఆసుపత్రుల అభివృద్ధికి చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి వైద్య కళాశాల తరగతులు ప్రారంభమవుతాయన్నారు. వైద్య రంగంలో ఖమ్మం ఆసుపత్రిని ఆదర్శంగా నిలుపాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణకు అధికారులందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు. వైద్యాధికారులు రాజశేఖర్గౌడ్, అమర్సింగ్, కృపా ఉషశ్రీ, సీతారాం, చైతన్య, అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.