వైరా టౌన్, జనవరి 13: తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను కేంద్రం కాపీ కొట్టి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నదని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. వైరా పట్టణంలోని కమ్మవారి కల్యాణ మండపంలో శుక్రవారం లావుడ్యా రాములునాయక్ అధ్యక్షతన ముఖ్యనేతలతో నిర్వహించిన బీఆర్ఎస్ ఖమ్మం బహిరంగ సభ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. వైరా నియోజకవర్గం నుంచి సుమారు 50 వేల మందిని సభకు తరలించాలని పిలుపునిచ్చారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని సంక్షేమ పథకాలను రాష్ట్రప్రభుత్వం అమలుపరుస్తున్నదని కొనియాడారు. మారుమూల ప్రాంతాల్లోని తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. వైద్యారోగ్యశాఖలో అమలవుతున్న రిజర్వేషన్లతో ఎంతోమంది ఎస్సీ, ఎస్టీ యువత వైద్యులయ్యారన్నారు. కారేపల్లి, వైరా ప్రభుత్వ ఆసుపత్రులను వంద పడకల ఆసుపత్రులుగా తీర్చిదిద్దేందుకు నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు.
బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎలాంటి విభేదాలు లేకుండా కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. బహిరంగ సభకు బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు సీపీఎం, సీపీఐ కార్యకర్తలనూ ఆహ్వానించాలన్నారు. ప్రతి కార్యకర్త సమన్వయంతో పని చేసి సభను విజయవంతం చేయాలన్నారు. అనంతరం మిషన్ కాకతీయ కార్మిక విభాగ నాయకుడు మద్దెల రవి ‘మిషన్ కాకతీయ’ కార్మికులకు వెంటనే వేతనాలు చెల్లించాలని మంత్రికి వినతిపత్రం అందజేశారు. సమావేశంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, రైతుబంధు సమితి రాష్ట్ర చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, రాష్ట్ర విద్యాసంస్థల మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ శ్రీధర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బానోత్ చంద్రావతి, బానోత్ మదన్లాల్, మార్క్ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, వైరా మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.