ఖమ్మం అర్బన్, మార్చి 20 : విద్యారంగంపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనేది కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభలో విద్యారంగానికి కేటాయించిన నిధులను చూస్తే అర్థమవుతోందని, ఇది ముమ్మాటికి విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వమేనని ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇటికాల రామకృష్ణ మండిపడ్డారు.
ఈ మేరకు ఖమ్మం నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వద్ద విద్యార్థులతో కలిసి శుక్రవారం ఆయన బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కార్ శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపులో డొల్లతనం కనిపిస్తోందన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలకు నిధుల కేటాయింపుపై ప్రస్తావనే లేదన్నారు. ఈ నిధులు విద్యాభివృద్ధి కోసం కాదు.. విద్యా దారిద్య్రానికి దారి తీస్తాయన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం నిధులు కేటాయించి విద్యారంగ అభివృద్ధికి, పేద విద్యార్థుల భవిష్యత్కు భరోసా కల్పించాలన్నారు. లేదంటే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మణ్, లోకేశ్, పవన్, గోపి, నరేందర్, సాయి, పావని, కళావతి, శశి, హేమ, మల్లిక తదితరులు పాల్గొన్నారు.