ఖమ్మం రూరల్/ తల్లాడ, జనవరి 5: ఖమ్మం నగర శివారు కామంచికల్, ఆ పరిసర గ్రామాల ప్రజల కష్టాలు మరికొన్ని రోజుల్లోనే తీరనున్నాయి. నిత్యం రద్దీగా ఉండే ఆ మార్గంలో దశాబ్దాల తరబడి సింగిల్ రోడ్డుతో అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులు తొలగిపోనున్నాయి. పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి ప్రత్యేక కృషి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సహకారంతో ఆ సింగిల్ రోడ్డు ఇక డబుల్ రోడ్డుగా విస్తరణ జరగనుంది. సుమారు రూ.27 కోట్లతో దానవాయిగూడెం నుంచి పాపటపల్లి వరకు జరిగే రహదారి విస్తరణ పనులకు రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్తో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. దీంతో నగరానికి ఇరువైపులా ఉన్న రహదారులు విశాలంగా విస్తరించాయి. ఖమ్మం – డోర్నకల్ రహదారి మాత్రం సాంకతిక, ఇతర కారణాల వల్ల విస్తరణకు నోచుకోకపోయింది. దీంతో డోరక్నల్ నుంచి వచ్చే ప్రయాణికులతోపాటు పాపటపల్లి, దారేడు, కామంచికల్, రామన్నపేట తదితర గ్రామాల ప్రజలు ఈ సింగిల్ రోడ్డు కారణంగా అనేక అవస్థలు పడుతున్నారు. ఈ రహదారిని ఓ చోట రైల్వేలైన్ క్రాస్ చేస్తుండడం వల్ల ఈ రోడ్డు విస్తరణ పనులకు తీవ్ర ఆటంకం కలిగింది. అయితే కొద్ది నెలలుగా స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి అజయ్కుమార్ సైతం ప్రత్యేక చొరవ తీసుకోవడంతో విస్తరణ పనులకు గ్రీన్సిగ్నల్ లభించింది. దీంతో శుక్రవారం ఈ రహదారి విస్తరణ పనులకు మంత్రులు శంకుస్థాపన చేయనున్నారు.
ఏర్పాట్లను పరిశీలించిన కందాళ
రోడ్డు విస్తరణ పనులు మొదలుకానుండడంతో దశాబ్దాల తరబడి కామంచికల్ రోడ్డు విస్తరణ కోసం వేచి చూస్తున్న ప్రజల పక్షాన మంత్రులకు, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలిపేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం కృతజ్ఞత సభ జరుగనున్నది. ఖమ్మం అర్బన్ మండలం దానవాయిగూడెం వద్ద ఉదయం 11:20 గంటలకు డబుల్రోడ్డు విస్తరణ పనులకు మంత్రులు శుంకుస్థాపన చేయనున్నారు. అనంతరం 12 గంటలకు 60వ డివిజన్ రామన్నపేటలో జరిగే కృతజ్ఞత సభలో పాల్గొననున్నారు. ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి గురువారం పరిశీలించారు. కార్యక్రమానికి మంత్రులతోపాటు ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజుతోపాటు ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.
తల్లాడ మండలంలో బీటీ రోడ్లు
సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రత్యేక చొరవతో తల్లాడ మండలం కుర్నవల్లి నుంచి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం ఉమ్మడదేవరపల్లి, తల్లాడ నుంచి మల్లారం మీదుగా గంగిదేవిపాడు వరకు రహదారులకు మోక్షం లభించింది. కుర్నవల్లి నుంచి ఉమ్మడదేవరపల్లి 5 కి.మీ. బీటీ రోడ్డుకు రూ.6.40 కోట్లు, తల్లాడ నుంచి మల్లారం మీదుగా గంగిదేవిపాడు వరకు 6.5 కి.మీ. మేర బీటీ రోడ్డుకు మరో రూ.9 కోట్లు నిధులు విడుదలయ్యాయి. కుర్నవల్లి- ఉమ్మడ దేవరపల్లి రోడ్డుతో కుర్నవల్లి, తాల్లూరు, ఉమ్మడదేవరపల్లికి, తల్లాడ- గంగిదేవిపాడు రోడ్డుతో తల్లాడ, మల్లవరం, గంగిదేవిపాడుకు రవాణా సౌకర్యం మెరుగుపడనున్నది. రోడ్లు పూర్తయితే వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, కూలీలు, ప్రజల రవాణా కష్టాలు తీరనున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం రోడ్ల నిర్మాణ పనులకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ శంకుస్థాపన చేయనున్నారు.
నేడు జిల్లాకు మంత్రులు అజయ్, ప్రశాంత్రెడ్డి
ఖమ్మం జిల్లాలో శుక్రవారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పర్యటించనున్నారు. పలు చోట్ల వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. వీరితోపాటు ఆయా కార్యక్రమాల్లో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, పాలేరు, సత్తుపల్లి ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ తాతా మధు పాల్గొననున్నారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు కూసుమంచిలోని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి క్యాంపు కార్యాలయానికి చేరుకొని అక్కడ బ్రేక్ ఫాస్ట్ చేస్తారు. 10 గంటలకు కూసుమంచి మండలం ఈశ్వరమాధారం – భగవత్వీడు – మద్దివారిగూడెం రోడ్డు నిర్మాణానికి , హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. 10:25 గంటలకు రాజుపేట చేరుకొని రాజుపేట – పెరికసింగారం కనెక్టింగ్ రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. 11:20 గంటలకు ఖమ్మంలోని దానవాయిగూడెం చేరకుంటారు. దానవాయిగూడెం – పాపటపల్లి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.
అనంతరం రామన్నపేట వద్ద జరిగే సభలో ప్రసంగిస్తారు. అక్కడి నుంచి ఖమ్మం నెహ్రూనగర్కు చేరుకొని మధ్యాహ్నం భోజనం చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 1:30 గంటలకు ఖమ్మం నుంచి బయలుదేరి 2 గంటలకు తల్లాడ చేరుకుంటారు. తల్లాడ – గంగదేవిపాడు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. 2:30 గంటలకు చెన్నూరు చేరుకొని రంగాపురం – చెన్నూరు రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తారు. 3 గంటలకు కుర్నవల్లి చేరుకొని కుర్నవల్లి – ఉమ్మడిదేవరపల్లి రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 4:15 గంటలకు ఖమ్మం చేరుకుంటారు.