ఖమ్మం, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సర్వం సమాయత్తమైంది. ఖమ్మం లోక్సభ నియోజకవర్గ పరిధిలో అన్ని రాజకీయ పక్షాలకన్నా ముందుగా బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పార్టీ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిందే తడువుగా నియోజకవర్గంలో ముఖ్యనేతలతో కలిసి సుడిగాలి పర్యటనలు ఇప్పటికే నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నేతగా, ఖమ్మం ఎంపీగా కేంద్ర ప్రభుత్వం ద్వారా తాను సాధించిన అనేక పనులతోపాటు విభజన హామీలకు సంబంధించి లోక్సభలో పోరాటం చేసిన తీరును ఆయన పలుసభల్లో చెప్పిన తీరు ప్రజలను, కార్యకర్తలను ఆకట్టుకుంటోంది. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సానుకూల వాతావరణం ఉండడంతో ప్రతి నియోజకవర్గంలో ఇప్పటికే విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా నేతలు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటామని భరోసా ఇచ్చారు.
పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు, వైరా మాజీ శాసనసభ్యులు బానోత్ మదన్లాల్, చంద్రావతి, రాములునాయక్, పాలేరు మాజీ ఎమ్మెల్యేకందాళ ఉపేందర్రెడ్డి, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావుతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ఆయా నియోజకవర్గాల్లో ఇప్పటికే పెద్దఎత్తున నియోజకవర్గస్థాయి సమావేశాలు నిర్వహించారు. ఈ నెల 18న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండడంతో నామా నాగేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఈ నెల 24న ఖమ్మంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ దాఖలు సందర్భంగా పెద్దఎత్తున ప్రదర్శన నిర్వహించాలని సంకల్పించారు. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో నామా నాగేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా సుమారు 1.60 లక్షల ఓట్ల మెజార్టీతో సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థిని రేణుకాచౌదరిపై విజయం సాధించారు. శాసనసభ ఎన్నికలకు భిన్నంగా లోక్సభ ఎన్నికల్లో ప్రజల తీర్పు గతంలోనూ ఉండడంతో ఈసారి అదే ఆనవాయితీ కొనసాగి నామా నాగేశ్వరరావు ఘన విజయం సాధిస్తారని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. మరోవైపు ఎన్నికల సమయం సమీపిస్తున్నా ప్రధాన రాజకీయ పార్టీ కాంగ్రెస్ ఇప్పటికీ ఖమ్మం లోక్సభ అభ్యర్థిని ఖరారు చేయకపోవడం, ఆ పార్టీలో రోజురో అభ్యర్థి పేరు తెరపైకి రావడంతో పార్టీ శ్రేణుల్లో కొంత గందరగోళం నెలకొన్నది. ఖమ్మం లోక్సభ సభ్యుడిగా అన్నివర్గాలతో పరిచయం ఉన్న నామా నాగేశ్వరరావు తన విజయం కోసం పార్టీ నేతల తోడ్పాటుతో వివిధవర్గాల ప్రజలను కలిసి రాష్ట్రంలో పదేళ్లపాటు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, లోక్సభ సభ్యుడిగా రెండు దఫాలుగా ఖమ్మం నియోజకవర్గ అభివృద్ధికి తాను చేసిన కృషిని వివరిస్తున్నారు.
2009లో తాను తొలిసారిగా లోక్సభ సభ్యునిగా ఎన్నికైన సమయంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధించేందుకు చేసిన కృషి జాతీయస్థాయిలో నాయకులను సమన్వయం చేయడానికి తీసుకున్న క్రియాశీలక పాత్రను ఆయన వివిధవర్గాల ప్రజలకు, పార్టీ శ్రేణులకు వివరిస్తున్నారు. మళ్లీ భవిష్యత్ బీఆర్ఎస్దేనని, కార్యకర్తలు మనోధైర్యాన్ని కోల్పోవాల్సిన అవసరంలేదని, జిల్లా పార్టీ నేతలతోపాటు తాను ప్రజలకు అండగా ఉంటామని, ఏ కష్టమొచ్చినా ఎంత అర్ధరాత్రయినా తన ఇంటి తలుపు తట్టవచ్చని, తన ఇల్లు పార్టీ కార్యకర్తల ఇల్లేనని ఆయన పార్టీ కార్యకర్తల్లో భరోసా నింపుతున్నారు. ఇప్పటికే మధిర, పాలేరు, సత్తుపల్లి, వైరా, అశ్వారావుపేట, కొత్తగూడెం నియోజకవర్గాల పరిధిలోని పలు మండలాల్లో నామా కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించారు. శనివారం మధిర నియోజకవర్గ పరిధిలోని ముదిగొండ మండలంలో పర్యటించి కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు. తాను ప్రజాసేవ కోసం అంకితమయ్యాయని, ప్రజాసమస్యల పరిష్కారానికి దశాబ్ధకాలంపాటు లోక్సభలో తెలంగాణ ప్రజల వాణిని, ఖమ్మం జిల్లా ప్రజల ఇబ్బందులను ఎలుగెత్తి చాటి అనేక సమస్యలు పరిష్కరించినట్లు వివరించారు. తెలంగాణ రాష్ట్రం విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో అనేకం అమలుచేయాల్సిన పరిస్థితి ఉన్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వాటిని పట్టించుకోవడంలేదని, ఖాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు వంటి ప్రధాన సమస్యల పరిష్కారంపై ఈసారి మరింత పోరాటం చేస్తామని నామా పలు సభల్లో నియోజకవర్గ ప్రజలకు భరోసా ఇస్తున్నారు.
నామా నాగేశ్వరరావు హాజరైన ప్రతిసభలోనూ పెద్దఎత్తున పార్టీ కార్యకర్తలు, ప్రజలు హాజరవుతుండడంతో బీఆర్ఎస్ పార్టీ విజయానికి ఈ హాజరుశాతం సంకేతాలుగా పార్టీ నేతలు భావిస్తున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ తదితరులు నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లో పార్టీ కార్యకర్తలను సమాయత్తం చేయడం, మండలాల వారీగా సమావేశాలు నిర్వహించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను ఇప్పటికే పార్టీ మండల, నియోజకవర్గ నేతలతో చర్చించి సమావేశ తేదీలను ఖరారు చేశారు. నామినేషన్ వేసేనాటికి నియోజకవర్గ పరిధిలోని ప్రధాన ప్రాంతాలన్నింటిలో పర్యటన చేయాలని ప్రణాళిక రూపొందించుకున్న నామా నామినేషన్ అనంతరం ఎన్నికల ప్రచారాన్ని మరింత వేగవంతం చేసేందుకు వ్యూహం రూపొందించారు. నామా నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు లోక్సభ నియోజకవర్గ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో బస్సు యాత్రల్లోనూ, బహిరంగ సభల్లోనూ పాల్గొనే అవకాశం ఉండటంతో ఆయా నియోజకవర్గాల పార్టీ నేతలు ఇందుకు సమాయత్తమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయకపోవడం, బీజేపీ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినా పార్టీ అభ్యర్థి జిల్లా నేతలకు రాజకీయంగా కొత్త కావడం వంటి అంశాలు ఈసారి బీఆర్ఎస్ అభ్యర్థి నామాకు కలిసి వస్తాయని బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి.
ఖమ్మం, ఏప్రిల్ 14 : బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఆదివారం ఖమ్మం నగరంలోని పలు చర్చిలను సందర్శించి, క్రైస్తవులతో మమేకమై ప్రార్థనల్లో పాల్గొన్నారు. చర్చి కాంపౌండ్, ఎన్ఎస్పీ, కరుణగిరి, బైపాస్ రోడ్డులోని చర్చిల్లో జరిగిన ప్రార్థనల్లో నామా పాల్గొని, క్రైస్తలను కలిసి ఎన్నికల్లో తనకు ఓటు వేసి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ఫాదర్లు ప్రత్యేక ప్రార్థనలు చేసి, నామాని ఆశీర్వదించారు. అభివృద్ధికి, ప్రజాసేవ కోసం, సంక్షేమం కోసం నామాపై దైవ కృప ఉంటుందని దీవించారు. ఈ సందర్భంగా బిషప్ ప్రత్యేక ప్రార్ధన చేసి, నామాను ఆశీర్వదించారు. కల్వరి టెంపుల్లో చర్చీ ఇన్చార్జ్ శ్రీనివాస్ బైబిల్ అందజేసి, నామాను సతరించారు. కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్, తాళ్లూరి జీవన్, చిత్తారు సింహాద్రి యాదవ్, నామా సేవా సమితి నుంచి రాజేశ్, చీకటి రాంబాబు, కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు.