కల్లూరు, ఏప్రిల్ 20: ఈ నెల 24న కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ముఖ్యఅతిథిగా హాజరుకానున్న ఈ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కోరారు. స్థానిక డీఎన్పీ ఫంక్షన్ హాల్లో గురువారం జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తర్వాత ఎక్కువ నిధులు ఇచ్చిన మంత్రి హరీశ్రావు అని అన్నారు. సత్తుపల్లిలో నిర్మిస్తున్న 100 బెడ్ల వైద్యశాలకు, కల్లూరు, పెనుబల్లి మండలాల్లో నిర్మించనున్న వైద్యశాలలకు సుమారు రూ.110 కోట్లు మంజూరు ఇచ్చినట్లు ఎమ్మెల్యే వివరించారు.
మంత్రి హరీశ్ రాక సందర్భంగా కల్లూరు, బత్తులపల్లి, ఎర్రబంజర, కప్పలబంధం, లక్ష్మీపురం, పుల్లయ్యబంజర, తూర్పు లోకవరం, పడమటి లోకవరం, హనుమాతండా, నారాయణపురం, కొర్లగూడెం, పేరువంచ, ముగ్గు వెంకటాపురం, చండ్రుపట్ల, రఘునాథగూడెం గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధికసంఖ్యలో పాల్గొనాలని కోరారు. శ్రేణులు భారీ మోటారు సైకిల్ ర్యాలీగా తరలివచ్చి ఘన స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి సుమారు 10 వేల మంది హాజరుకావాలని కార్యకర్తలకు సూచించారు. అదేవిధంగా రూ.3.40 కోట్లతో కల్లూరులో నూతనంగా నిర్మాణమైన మినీ స్టేడియాన్ని ప్రారంభించేందుకు రాష్ట్ర క్రీడలశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ రానున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అందుకు అనుగుణంగా నాయకులు, ప్రజాప్రతినిధులు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు, పార్టీ ప్రజాప్రతినిధులు పాలెపు రామారావు, కట్టా అజయ్బాబు, పసుమర్తి చందర్రావు, లక్కినేని రఘు, పెడకంటి రామకృష్ణ, కాటంనేని వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ తల్లాడ మండల ఆత్మీయ సమ్మేళనం శుక్రవారం రామానుజవరంలో నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ మండల అధ్యక్షుడు రెడ్డెం వీరమోహన్రెడ్డి, ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ దుగ్గిదేవర వెంకట్లాల్, జడ్పీటీసీ దిరిశాల ప్రమీల గురువారం తెలిపారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధు, జడ్పీచైర్మన్ కమల్రాజు హాజరవుతారన్నారు.