ఖమ్మం, మార్చి 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వంట గ్యాస్ సిలిండర్ ధర పెంపుపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. కేంద్రంలోని బీజేపీ సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా శుక్రవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసనలు హోరెత్తాయి. రహదారులపై వంటావార్పు నిర్వహించారు. ర్యాలీలు నిర్వహించి మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఖమ్మం నగరంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ధర్నాచౌక్లో నిరసన చేపట్టారు. రహదారిపై వంటావార్పు నిర్వహించారు. తల్లాడలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కట్టెల మోపును మోస్తూ వినూత్న నిరసన తెలిపారు. మణుగూరులో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, వైరా రింగ్ రోడ్డులో ఎమ్మెల్యే రాములునాయక్, మధిరలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు నిరసన తెలిపారు. ‘గ్యాస్ ధరలు పెంచి ప్రజలపై గుదిబండ మోపిన ప్రధాని మోదీ.. ఖబడ్దార్’ అంటూ మంత్రి అజయ్ హెచ్చరించారు. దేశ ప్రజల కష్టాలు, బాధలు పట్టవా? అంటూ నిలదీశారు.
‘గ్యాస్ ధరలు పెంచి ప్రజలపై గుదిబండ మోపిన ప్రధాని మోదీ.. ఖబడ్దార్’ అంటూ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్కుమార్ హెచ్చరించారు. దేశ ప్రజల కష్టాలు, బాధలు పట్టవా? అంటూ ప్రశ్నించారు. పెంచిన ధరలు తగ్గించకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించుతామని, ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచడాన్ని వ్యతిరేకిస్తూ అన్ని జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఆ పార్టీ జిల్లా, నియోజకవర్గ కమిటీల ఆధ్వర్యంలో ఖమ్మంలోని ధర్నాచౌక్లో శుక్రవారం ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అజయ్కుమార్ మాట్లాడుతూ.. ఏడాదిలో మూడుసార్లు గ్యాస్ సిలిండర్ల ధరలు పెంచితే ఒక్క బీజేపీ నాయకుడూ మాట్లాడకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ధరలను పెంచడం వల్ల నేడు కోట్లాది కుటుంబాలు గ్యాస్కు దూరమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
హోరెత్తిన నిరసనలు..
గ్యాస్ ధరల పెంపుపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. గ్రామాలు, పట్టణాలు, మండల కేంద్రాల్లో మహిళలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి వినూత్న పద్ధతుల్లో నిరసనలు వ్యక్తం చేశారు. ‘మోదీ.. డౌన్ దీ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. జిల్లా కేంద్రంలోని ధర్నాచౌక్లో చేపట్టిన నిరసనలో పువ్వాడ అజయ్కుమార్ పాల్గొన్నారు. పాత కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై కట్టెల పొయ్యిపై వంటావార్పు చేస్తూ నిరసన తెలిపారు. నల్ల దుస్తులు, నల్ల బ్యాడ్జీలు ధరించి, గ్యాస్ సిలిండర్, వాటి కటౌట్లు ఎత్తుకొని నిరసన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పునుకొల్లు నీరజ, బచ్చు విజయ్కుమార్, కూరాకుల నాగభూషణం, పగడాల నాగరాజు, దోరేపల్లి శ్వేత తదితరులు పాల్గొన్నారు.
నియోజకవర్గాల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు..
ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. సత్తుపల్లి, తల్లాడలో జరిగిన భారీ నిరసన ప్రదర్శనలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. వైరా రింగ్ రోడ్డులో జరిగిన నిరసనలో ఎమ్మెల్యే రాములునాయక్ మాట్లాడారు. ప్రధాని మోదీ ఓట్ల గురించి తప్ప ప్రజల బాధల గురించి ఆలోచించడం లేదని విమర్శించారు. ఏన్కూరులో జరిగిన ధర్నాలో వైరా మాజీ ఎమ్మెల్యే బాణోత్ చంద్రావతి పాల్గొన్నారు. దున్నపోతుకు వినతిపత్రం అందించి నిరసన తెలిపారు. మధిరలో జరిగిన ధర్నాలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, బోనకల్లులో జరిగిన నిరసనలో టీఎస్ సీడ్స్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. భద్రాద్రి జిల్లా పినపాక నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కూడా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.