ముదిగొండ, నవంబర్ 15: ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకే ప్రజల్లో విలువ లేదని బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ అభ్యర్థి లింగాల కమల్రాజు విమర్శించారు. ఇక పార్టీ నేతలు ఇస్తున్న ఆరు గ్యారెంటీ హామీలకు అసలే విలువ లేదని స్పష్టం చేశారు. ముదిగొండ మండలంలో బుధవారం పర్యటించిన ఆయన.. టీఎస్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావుతో కలిసి చిరుమర్రి, పమ్మి, మల్లన్నపాలెం, గంధసిరి, పెద్దమండవ, బాణాపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యేగా గెలిచిన భట్టి విక్రమార్క.. ఎన్నిలప్పుడు రావడం, ప్రజలను ప్రలోభపెట్టడం, ఓట్లు వేయించుకొని చిత్తగించడం తప్ప ప్రజలకు ఆయనకు చేసిన మేలు ఏమీ లేదని విమర్శించారు. పైగా నియోజకవర్గ అభివృద్ధి గురించి, దళితబంధు పథకం గురించి ఆయన మాట్లాడుతుండడం విడ్డూరంగా ఉందని అన్నారు. తన వల్లే దళితబంధు పథకం వచ్చిందంటూ భట్టి చెప్పుకుంటుండడం సిగ్గుచేటని అన్నారు. దళితబంధు పథకం సృష్టికర్త సీఎం కేసీఆర్ మాత్రమేనని, ఆయన వల్లనే ఆ పథకం వచ్చిందని, వేలాదిమంది దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపిందని స్పష్టం చేశారు. అసలు దళితబంధు పథకం గురించి అర్హత కూడా భట్టికి ఎంతమాత్రమూ లేదని స్పష్టం చేశారు.
తెలంగాణ సిద్ధించాక ఈ పదేళ్లలో సీఎం కేసీఆర్ పాలనలోనే ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారని స్పష్టం చేశారు. ప్రతి కుటుంబానికీ సంక్షేమ పథకాలు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు. ఇక్కడి ప్రజలు భట్టిని మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఏమీ చేయలేదని విమర్శించారు. తనకు ఒక్కసారి అవకాశమిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. ఈ సందర్బంగా పలు గ్రామాల్లో వివిధ పార్టీలకు చెందిన ప్రజలు కమల్రాజు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు వాచేపల్లి లక్ష్మారెడ్డి, సామినేని హరిప్రసాద్, పసుపులేటి దుర్గ, పోట్ల ప్రసాద్, మందరపు ఎర్ర వెంకన్న, తోట ధర్మారావు, సామినేని నాగభూషణం, ఓరుగంటి నాగేశ్వరరావు, దారా రాము, ఇనుకొండ రమేశ్, సామినేని వెంటేశ్వర్లు, గడ్డం వెంకటేశ్వర్లు, రాయబారపు నాగబాబు, ఉపేందర్, స్వాతి, బంక మల్లయ్య, కోటి అనంతరాములు, పంది శ్రీను, సుభాషిణి, రాజుల సుజాత, బ్రహ్మారెడ్డి, కోడెబాబు, రాము, పచ్చ సీతరామయ్య, బండ్ల వాసు, భిక్షం, హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.