ఖమ్మం, మార్చి 5 : ఖమ్మం నగరానికి చెందిన రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రకు రెండోసారి సైతం రాజ్యసభకు అవకాశం కల్పించడం పట్ల బీఆర్ఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో ఈ నెల 7వ తేదీ సాయంత్రం 4 గంటలకు జరిగే మాజీ సీఎం కేసీఆర్ కృతజ్ఞత సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ పిలుపునిచ్చారు. మంగళవారం నగరంలోని తెలంగాణభవన్లో శీలంశెట్టి వీరభద్రం అధ్యక్షతన జరిగిన బీసీ ముఖ్యనాయకుల సమావేశం, తర్వాత నగర మేయర్ పునుకొల్లు నీరజ అధ్యక్షతన జరిగిన కార్పొరేటర్లు, ఇతర ముఖ్యనాయకులు, పార్టీ మండల అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులతో జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజుతో కలిసి తాతా మధు మాట్లాడారు.
బీసీ నాయకులకు ఉన్నత పదవులు అందించిన ఏకైక వ్యక్తి మాజీ సీఎం కేసీఆర్ మాత్రమేనని అన్నారు. ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందినప్పటికీ నాయకులు, కార్యకర్తలు ఆత్మధైర్యాన్ని కోల్పోవద్దని, పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఈ సభకు పెద్దఎత్తున బీసీ నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ శ్రేణులు తరలిరావాలని కోరారు. సమావేశంలో జిల్లా బీసీ ముఖ్య నాయకులు, వివిధ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.