ఖమ్మం, జూలై 1: కాంగ్రెస్ పార్టీది మోసాల చరిత్ర అని, కుంభకోణాలకు ఆ పార్టీ మారుపేరని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు విమర్శించారు. గజం స్థలం అడిగినందుకే ముదిగొండల్లో నిరుపేదలను పిట్టల్లా కాల్చి చంపిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని జిల్లాకు వస్తున్నారని ప్రశ్నించారు. ముదిగొండ అమరుల కుటుంబాలకు క్షమాపణ చెప్పి జిల్లాలో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అప్పట్లో ఉమ్మడి జిల్లాలో భూమి కోసం పోరాడిన పేదలపై కేసులు పెట్టింది, వారిని జైళ్లకు పంపింది కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు కావా? అని ప్రశ్నించారు. కానీ తాత ముత్తాతల నుంచి అడవిని నమ్ముకుని బతుకుతున్న అడవిబిడ్డల గోస తీర్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టంచేశారు. తెలంగాణ వ్యాప్తంగా 4 లక్షల మంది ఆదివాసీ బిడ్డలకు ఒక్కరోజే పోడు పట్టాలు ఇచ్చి సరికొత్త రికార్డు సృష్టించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని గుర్తుచేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 62 వేల కుటుంబాలు సాగు చేసుకుంటున్న 1.90 లక్షల ఎకరాల పోడు భూమికి పట్టాలు ఇచ్చిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని గుర్తుచేశారు. అయినప్పటికీ సీఎం కేసీఆర్పై ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేయడం దుర్మార్గమని అన్నారు.
గిరిజనుల సంక్షేమానికి కట్టుబడిన ప్రభుత్వంపై అవాకులు, చవాకులు పేలితే సహించబోమని హెచ్చరించారు. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీని మోసం చేయడమే పొంగులేటి నైజమని దుయ్యబట్టారు. ఆయన కాంగ్రెస్లో చేరిన నెల రోజుల తరువాత నిజమైన బొమ్మ కనపడుతుందని విమర్శించారు. రాహుల్గాంధీ సభకు ప్రజలు రారనే అపనమ్మకంతోనే సీఎం కేసీఆర్పైనా, మంత్రి అజయ్పైనా పొంగులేటి అవాకులు చవాకులు పేలుతున్నారని విమర్శించారు. పద్ధతి మానుకోకపోతే తగిన బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు. ఉద్యమకారులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు ఉప్పల వెంకటరమణ, కమర్తపు మురళి, పగడాల నాగరాజు, నల్లమల వెంకటేశ్వర్లు, చింతనిప్పు కృష్ణచైతన్య, బెల్లం వేణు, పగడాల నరేందర్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.