కూసుమంచి, జనవరి 13: ఈ నెల 18న ఖమ్మంలో నిర్వహించనున్న బహిరంగ సభ చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. దేశంలో సంక్షేమ పాలన అందించేందుకే బీఆర్ఎస్ ఆవిర్భవించిందని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ సభ విజయవంతం కోసం పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలతో కూసుమంచిలో శుక్రవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. హద్దూఅదుపూ లేకుండా ధరలు పెంచుతున్న కేంద్రం ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలనూ పీల్చిపిప్పి చేస్తోందని దుయ్యబట్టారు. పైగా తెలంగాణ పథకాలను కాపీ కొడుతోందని విమర్శించారు. బీఆర్ఎస్ ఆవిర్భావం తరువాత మొదటిసారిగా ఈ నెల 18న ఖమ్మంలో నిర్వహించనున్న గొప్ప బహిరంగ సభను దేశ చరిత్రలో నిలిచిపోయేలా సక్సెస్ చేయాలని కోరారు.
రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లోకెల్లా పాలేరు నియోజకవర్గ ప్రజలు, రైతులే అదృష్టవంతులని అన్నారు. ఎస్ఆర్ఎస్పీ ద్వారా గోదావరి జలాలను, భక్తరామదాసు ద్వారా కృష్ణా జలాలను వినియోగించుకుంటూ సుభిక్షంగా ఉన్నారని అన్నారు. కేసీఆర్ పాలనపై అందరికంటే బాధ్యతాయుతమైన పాత్ర పాలేరు ప్రజలపైనే ఉందని అన్నారు. 2001 ఏప్రిల్ 17న కరీంనగర్ సింహగర్జన సభ తెలంగాణ ఉద్యమానికి ఎలా మార్గం చూపిందో ఈ నె 18న ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ సభ దేశానికి దిశానిర్దేశం చూపనుందని అన్నారు.
ఖమ్మంలో సభతో సత్తా చూపాలి: ఎమ్మెల్సీ పల్లా, ఎమ్మెల్యే కందాళ
2001లో కరీంనగర్ సింహగర్జన సభలాగే ఈ నెల 18న జరగబోయే ఖమ్మం సభ కూడా చరిత్రలో నిలిచిపోతుందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం బహిరంగ సభను విజయవంతం చేసి బీఆర్ఎస్ సత్తా ఏమిటో దేశానికి చూపించాలని ఆకాంక్షించారు. సభ విజయవంతం కోసం కార్యకర్తలందరూ నడుంబిగించాలని పిలుపునిచ్చారు. రైతుబంధు పంటల పెట్టుబడి సాయం కింద రాష్ట్రంలో 10 విడతల్లో రైతులకు రూ.65 వేల కోట్లు అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని అన్నారు. ఖమ్మం సభ జయప్రదానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు బాధ్యతాయుతంగా పని చేయాలని సూచించారు. పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి మాట్లాడుతూ.. ఖమ్మం సభ విజయవంతం కోసం గ్రామాల్లోని కార్యకర్తలందరూ ఈ నాలుగు రోజులూ కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. అన్ని గ్రామాల్లోనూ నాయకులు విస్తృత ప్రచారం చేస్తూ అధిక సంఖ్యలో ప్రజలను తరలించాలని సూచించారు.
సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందు వరుసలో ఉందని స్పష్టం చేశారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ చేస్తున్న సంక్షేమ పథకాలు తమకూ కావాలంటూ దేశాంలోని అన్ని రాష్ర్టాల ప్రజలూ కోరుకుంటున్నారని అన్నారు. నాలుగు మండలాల బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఇన్చార్జులు సంపత్రెడ్డి, కుసుమ జగదీశ్, రాంబాబుయాదవ్, రాకేశ్రెడ్డి, మరికంటి ధనలక్ష్మి, రామసహాయం బాలకృష్ణారెడ్డి, ఇంటూరి శేఖర్, ఇంటూరి బేబీ, యండపల్లి వరప్రసాద్, బెల్లం ఉమ, బాణోత్ శ్రీను, బోడా మంగీలాల్, వజ్జా రమ్య, వేముల వీరయ్య, బెల్లం వేణు, ఉన్నం బ్రహ్మయ్య, పాషబోయిన వీరన్న, వాసంశెట్టి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.