ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ‘పది’కి పది సీట్ల గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నది. నాలుగున్నరేళ్లలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిర్విఘ్నంగా కొనసాగించి.. అభివృద్ధి పనులకు రూ.వేల కోట్ల నిధులను వరదలా పారించింది. శాసనసభ ఎన్నికల బరిలో నిలిచే పది నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసిన బీఆర్ఎస్ ప్రచారాన్ని ఉరకలెత్తిస్తున్నది. ఉమ్మడి జిల్లాలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా సీఎం కేసీఆర్ తొలుత ఐదు నియోజకవర్గాల్లో మూడు విడతలుగా ఎన్నికల ప్రచారం చేసేందుకు అధికారికంగా తేదీలు ఖరారయ్యాయి. చేసిన అభివృద్ధి కళ్లముందు కనిపిస్తున్నా.. కళ్లున్న కబోదిలా వ్యవహరిస్తూ విమర్శనాస్ర్తాలు సంధిస్తున్న రాజకీయ ప్రత్యర్థులకు తనదైన శైలిలో సీఎం కేసీఆర్ సమాధానం ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో సభాస్థలి ఏర్పాటు, జన సమీకరణ తదితర అంశాలపై బీఆర్ఎస్ అభ్యర్థులు, శ్రేణులు దృష్టి సారించాయి.
ఖమ్మం, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : శాసనసభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది స్థానాలు గెలుచుకోవడంపై దృష్టి సారించింది. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచార పర్వాన్ని పరిగెత్తించేందుకు ప్రణాళిక రచించి వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నెలకొన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఉమ్మడి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో మూడు విడతలుగా ఎన్నికల ప్రచారం చేసేందుకు పర్యటన తేదీలు అధికారికంగా ఖరారు చేసింది. దీంతో ఆయా నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నెలకొనగా.. రాజకీయ ప్రత్యర్థుల గుండెల్లో గుబులు షురువైంది. బీఆర్ఎస్ పార్టీపై రాజకీయ అక్కసు వెళ్లగక్కుతున్న నేతల తీరును ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత హోదాలో సభల్లో తూర్పారబట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలో పది సీట్లు పక్కాగా గెలుచుకునేందుకు బీఆర్ఎస్ ప్రచార పర్వం సాగించనున్నది.
ముఖ్యమంత్రి కేసీఆర్ తొలుత ఈనెల 27న పాలేరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మధ్యా హ్నం ఒంటిగంట నుంచి 2 గంటల వరకు జరిగే బహిరంగ సభలో పాల్గొని పార్టీ అభ్యర్థి కందాళ ఉపేందర్రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారం చేయనున్నారు. గత ఎన్నికల్లో అనుభవాలను పరిగణనలోకి తీసుకుని ఈసారి పది నియోజకవర్గాల్లో కార్యకర్తలను పటిష్టం చేయడంతోపాటు పూర్తిస్థాయి వ్యూహ ప్రతివ్యూహాలతో ఎన్నికల్లో విజయం సాధించేలా నియోజకవర్గ స్థాయిలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు ఇప్పటికే పార్టీ కార్యాచరణ ప్రారంభించింది. ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రత్యర్థులు చేసిన అవాకులు, చవాకులకు పూర్తిస్థాయి విజయాలతో జవాబు చెప్పాలని సంకల్పించింది.
బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ గత నెలలో ఖమ్మం జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ నెల రోజులుగా ఖమ్మం నియోజకవర్గంతోపాటు పలు ప్రాంతాల్లో పర్యటించి పార్టీ విజయంపై ప్రత్యేక దృష్టి సారించారు. బీఆర్ఎస్ అభ్యర్థులందరూ ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఒక దఫా ప్రచారాన్ని పూర్తి చేయడం.. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడం ద్వారా ఇతర రాజకీయ పక్షాల కన్నా ప్రచారంలో ముందంజలో ఉంది.
2018 శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక ఫలితాలు రావడంతో ఉమ్మడి జిల్లాపై ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నాలుగేళ్లుగా ప్రత్యేక దృష్టి సారించారు. ఖమ్మం ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ తరఫున విజయం సాధించిన పువ్వాడ అజయ్కుమార్కు మంత్రివర్గంలో స్థానం కల్పించారు. అలాగే ఉమ్మడి జిల్లాలో వేల కోట్ల రూపాయల నిధులను వరదలా ప్రవహింపజేసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మంత్రి పువ్వాడ నేతృత్వంలో ఖమ్మం నియోజకవర్గంలో వేలకోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరగ్గా.. సత్తుపల్లి, పాలేరు, వైరా, మధిర, కొత్తగూడెం, ఇల్లెందు, అశ్వారావుపేట, పినపాక, భద్రాచలం నియోజకవర్గాల్లో వేలకోట్ల రూపాయల అభివృద్ధి పనులను బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసింది. ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో సానుకూలత వ్యక్తం కావడంతో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు ఈసారి సునాయాసమన్న భావన వ్యక్తమవుతోంది. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన గ్రామపంచాయతీ, మండల పరిషత్, మున్సిపాలిటీ, సహకార సంఘాల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా విజయ బావుటా ఎగురవేసింది.
ఇటీవలి కాలం వరకు బీఆర్ఎస్లో ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే వారితో బీఆర్ఎస్ జెండా మోసిన నేతలు, కార్యకర్తలు ఎవరూ పెద్దగా వెళ్లకపోవడంతో ఉమ్మడి జిల్లాలో పార్టీ చెక్కుచెదరకుండా ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులకు రాజకీయ దిశానిర్దేశం చేసేందుకు.. ఉమ్మడి జిల్లా ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించేందుకు సీఎం కేసీఆర్ పర్యటనకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం. ఈనెల 27న పాలేరులో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం కేసీఆర్ నవంబర్ 1న సత్తుపల్లి, ఇల్లెందుల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించడంతోపాటు అక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు సండ్ర వెంకటవీరయ్య, బానోతు హరిప్రియానాయక్ల గెలుపును కాంక్షిస్తూ ప్రచారం చేయనున్నారు. నవంబర్ 5న కొత్తగూడెం, ఖమ్మంలో సీఎం పర్యటించనున్నారు.
తొలుత కొత్తగూడెం సభలో పాల్గొని అనంతరం ఖమ్మం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం కొత్తగూడెం అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు, ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి పువ్వాడ అజయ్కుమార్ గెలుపును కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఐదు నియోజకవర్గాల్లో పర్యటన తేదీలు అధికారికంగా ఖరారు కావడంతో పాలేరు, ఖమ్మం, సత్తుపల్లి, ఇల్లెందు, కొత్తగూడెం నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు దృష్టి సారించారు. ఇప్పటికే ఆయా అభ్యర్థులు సభాస్థలితోపాటు ముఖ్యమంత్రి రాక సందర్భంగా చేసే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఉమ్మడి జిల్లాలో పోలీసు అధికారులు సీఎం పర్యటనకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లలో లీనమయ్యారు. మరోవిడత నవంబర్ రెండో వారంలో మధిర, వైరా, అశ్వారావుపేట, భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో సీఎం పర్యటించనున్నట్లు సమాచారం. ఈ మేరకు నవంబర్ మొదటి వారంలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పర్యటన తేదీలు ఖరారయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ఉమ్మడి జిల్లాలోని ప్రతి నియోజకవర్గంపై ముఖ్యమంత్రి దృష్టి సారించి.. పార్టీ విజయానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించడంతో పార్టీ అభ్యర్థుల్లోనూ, పార్టీ శ్రేణుల్లోనూ నూతనోత్తేజం కనిపిస్తోంది.