ఖమ్మం, నవంబర్ 20: ఎన్నెన్నో మాటలు చెబుతున్న కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు.. అతను ఖమ్మం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి ఏమీ లేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ విమర్శించారు. అసభ్య పదజాలంతో దూషించడం, అహంకార దర్పాన్ని ప్రదర్శించడం, కాలు మీద కాలు వేసుకొని ప్రజలకు చెప్పులు చూపించడం తప్ప ఆయన మరేమీ చెయ్యలేదని దుయ్యబట్టారు. 2014 వరకు ఖమ్మం ఎమ్మెల్యేగా ఉన్న తుమ్మల.. ఇక్కడి తాగునీటి సమస్యను ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు. వీటన్నింటి గురించీ ప్రజలు ఆలోచించాలని కోరారు. ఖమ్మం నగరంలో సోమవారం పర్యటించిన ఆయన.. 50వ డివిజన్లో కార్పొరేటర్ రాపర్తి శరత్ ఆధ్వర్యంలో, 53వ డివిజన్లో ముళ్ల ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనాల్లో మాట్లాడారు. ఖమ్మం నియోజకవర్గం ఒకప్పుడు ఎలా ఉండేదో, ఇప్పుడు ఎలా ఉందో ఇక్కడి ప్రజలకు బాగా తెలుసునని అన్నారు. తాను ఖమ్మం ఎమ్మెల్యేగా గెలుపొందే నాటికి ఇక్కడి తాగునీటి సమస్య ఎలా ఉందో తనకు ఇంకా గుర్తే ఉందని అన్నారు. అందుకే ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి నడుం బిగించానని గుర్తుచేశారు. తుమ్మల పదవీకాలం పూర్తయ్యే నాటికి ఖమ్మంలో నాలుగే ఓవర్ హెడ్ ట్యాంకులు ఉండేవని, తాను మంత్రిని అయ్యాక వాటి సంఖ్య 24కు పెంచానని గుర్తుచేశారు.
సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో మిషన్ భగీరథ పథకం ద్వారా రూ.350 కోట్లతో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించానని అన్నారు. గతంలో 25 వేల నల్లా కనెక్షన్లు ఉండగా ఇప్పుడు వాటిని 75 వేలకు పెంచామని, పైగా ఒక్క రూపాయికే కనెక్షన్ అందించి ఇంటింటి శుద్ధజలాలు సరఫరా చేస్తున్నామని వివరించారు. ఇవన్నీ తాను చేస్తే అతను చేసినట్లుగా తుమ్మల చెప్పుకుంటున్నారని విమర్శించారు. వయసును, అనుభవాన్ని మర్చిపోయి తుమ్మల పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని అన్నారు. ప్రజలు వీటన్నింటినీ గమనించి తనకు అత్యధిక మెజార్టీ అందించాలని కోరారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు కూరాకుల నాగభూషణం, పగడాల శ్రీవిద్య, పగడాల నాగరాజు, అమరగాని వెంకన్న, బత్తుల మురళి, పొన్నం వెంకటేశ్వర్లు, రేణుక, కృష్ణయ్య, ఖాసిం, ఝాన్సీ, రాపర్తి అరవింద్కుమార్, చింతల మల్లికార్జున్, ఎండీ గౌస్, సంతోశ్, గోరంట్ల రవి, మారుతి శ్రీనివాస్రావు, మేదరమెట్ల స్వరూపారాణి, ముళ్ల ప్రసాద్, శేషయ్య, కుతుంబాక హనుమయ్య, పుసులూరి వెంకయ్య, పూసులూరి సత్యనారాయణ, ఈశ్వరాచారి, ఉపేంద్రాచారి, పోట్ల జగన్నాథం, లింగబాయిన సతీశ్, కొడిరేక ఉమాశంకర్, అబ్బాస్, దిలీప్, గంటా భీమయ్య తదితరులు పాల్గొన్నారు.