మధిర రూరల్, నవంబర్ 22: నియోజకవర్గంలోని అభివృద్ధి పనులన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినవేనని జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ అభ్యర్థి లింగాల కమల్రాజు పేర్కొన్నారు. ఇందుకోసం ఇక్కడి ఎమ్మెల్యే భట్టి విక్రమార్క నిధులేమీ తేలేదని, అసలు ఏ గ్రామంలోనూ పర్యటించలేదని విమర్శించారు. ఇక్కడ జరిగిన అభివృద్ధి పనుల్లోని ప్రతి ఇటుక బిళ్ల కూడా సీఎం కేసీఆర్ పంపినదేనని స్పష్టం చేశారు. అందుకని ఆయన ఆశీర్వాదంతో వచ్చిన తనను ఇక్కడి ప్రజలు ఈ ఎన్నికల్లో ఆదరించాలని కోరారు. కారు గుర్తుకు ఓటు వేసి తనకు అత్యధిక మెజార్టీ అందించాలని విజ్ఞప్తి చేశారు. తాను కూడా ప్రజల నియోజకవర్గ ప్రజల మధ్యనే ఉంటున్నానని, వారి కష్టసుఖాల్లో పాల్పంచుకుంటున్నానని అన్నారు.
మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం పర్యటించిన ఆయన.. ఇంటింటికీ వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని గమనించి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. గ్రామాల్లో జరిగిన ఏ చిన్న పని అయినా తెలంగాణ ప్రభుత్వం చేసినదేనని అన్నారు. గ్రామాల్లో చిన్న చిన్న రోడ్లు మిగిలిపోయి ఉంటే త్వరలోనే వాటిని పూర్తి చేస్తామని అన్నారు. కల్యాణలక్ష్మి, రైతుబంధు వంటి పథకాల లబ్ధిదారులందరూ బీఆర్ఎస్ ప్రభుత్వం వైపే ఉన్నారని అన్నారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు నండ్రు సుశీల, కోటా రామారావు, బంగారమ్మ, బొగ్గుల పద్మావతి, గుర్రం రామారావు, రంగిశెట్టి కోటేశ్వరరావు, రావూరి శ్రీనివాసరావు, చిత్తారు నాగేశ్వరరావు, చావా వేణు, కటికల వెంకటసత్యనారాయణరెడ్డి, రావూరి రామారావు తదితరులు పాల్గొన్నారు.