ముదిగొండ, నవంబర్ 24: మధిర నియోజవర్గ అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమని జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ అభ్యర్థి లింగాల కమల్రాజ్ స్పష్టం చేశారు. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మూడుసార్లు గెలిచిన భట్టి విక్రమార్కకు ఇక్కడి సమస్యలపై కనీస అవగాహన లేదని అన్నారు. కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు తీసుకోవడం తప్ప ఆయనకు నియోజకవర్గ ప్రజల సమస్యలు పట్టవని విమర్శించారు. ముదిగొండ మండలంలో శుక్రవారం పర్యటించిన ఆయన.. కమలాపురం, అయ్యగారిపల్లి, మల్లారం, వల్లభి గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంత ప్రజలను సమస్యల గురించి తెలుసుకోని ఆయన.. ఎక్కడో పాదయాత్ర చేసి వారి సమస్యలు తీరాస్తానని హామీలు ఇవ్వడం విడ్డూరంగా ఉందని అన్నారు.
కేవలం కమీషన్లు ఇవ్వలేదనే కారణంతో అనేక ప్రాజెక్టులను ఆయన అర్ధాంతరంగా నిలిపివేయించారని ఆరోపించారు. ఇలాంటి వ్యక్తికి మధిర ప్రజలు మరోసారి అవకాశం ఇవ్వకూడదని అన్నారు. ఈ ఎన్నికల్లో తగిన బుద్ధిచెప్పాలని కోరారు. గత ఎన్నికల్లో తాను ఇక్కడ గెలవకపోయినా సీఎం కేసీఆర్తో చర్చించి ఈ నియోజకవర్గమంతా దళితబంధు అమలు చేసేందుకు కృషిచేశానని అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి తనకు అత్యధిక మెజార్టీ అందించాలని కోరారు. తాను గెలిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు వాచేపల్లి లక్ష్మారెడ్డి, సామినేని హరిప్రసాద్, పసుపులేటి దుర్గ, పోట్ల ప్రసాద్, పోట్ల కృష్ణకుమారి, మందరపు ఎర్ర వెంకన్న, బత్తుల వీరారెడ్డి, బత్తుల అమల, తోట ధర్మారావు, ఏలూరి రమేశ్, సామినేని వెంటేశ్వర్లు, గడ్డం వెంకటేశ్వర్లు, స్వాతి, బంక మల్లయ్య, రాంబాబు, భిక్షం తదితరులు పాల్గొన్నారు.