కారేపల్లి, ఏప్రిల్ 27 : ప్రమాదవశాత్తు బావిలో పడి బాలుడు మృతి చెందిన సంఘటన సింగరేణి మండల పరిధిలోని పేరుపల్లెలో సోమవారం చోటుచేసుకుంది. పేరుపల్లి గ్రామానికి చెందిన బచ్చలకూరి వెంకన్న, మంజు దంపతుల కుమారుడు దీపక్ శ్రీనాథ్(10) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో తల్లి మంజుతో కలిసి మేకలను మేపేందుకు వెళ్లాడు. మల్లన్నగూడెం సమీపంలోని రోడ్డు పక్కన గల ఓ బావి వద్ద బాలుడు కాలుజారి నీళ్లలో పడి మునిగిపోయాడు. స్థానికులు వచ్చి కాపాడేలోపే అప్పటికే మృతి చెందాడు. బాలుడు తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.