ఖమ్మం, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్కు భారీ షాక్ తగిలింది. దశాబ్దాలుగా కాంగ్రెస్ను నమ్ముకొని అనేక సేవలందించిన ముఖ్య నేతలు ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉండి.. మంత్రిగా, శాసనసభ్యుడిగా, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన మాజీ మంత్రి, టీపీపీసీ ముఖ్య నేత సంభాని చంద్రశేఖర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి రాజీనామా లేఖను పంపారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ అయిన తనకు జరిగిన అవమానాలను భరించలేక పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు అందులో లేఖలో పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్కు బలమైన నేతగా ఉన్న సంభాని చంద్రశేఖర్తోపాటు సత్తుపలి నియోజకవర్గంలో బలమైన నాయకుడిగా ఉన్న పీసీసీ ప్రధాన కార్యదర్శి కౌతోజు మానవతారాయ్ రాజీనామా చేయడంతో ఆ పార్టీలో కలవరం మొదలైంది. అలాగే, కొత్తగూడెం కాంగ్రెస్ నేత, పీసీసీ సభ్యుడు ఎడవల్లి కృష్ణ కూడా కాంగ్రెస్కు రాజీనామా చేశారు. అది కూడా ఆ నియోజకవర్గంలో ఆ పార్టీకి తీవ్ర నష్టమని ఆ పార్టీ వర్గాలే భావిస్తున్నాయి. అలాగే, వైరా నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత రాంచందర్నాయక్, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు అయిన ఊకే అబ్బయ్య, ఇల్లెందుకు చెందిన కాంగ్రెస్ నాయకుడు మడత వెంకట్గౌడ్ కూడా మూకుమ్మడిగా ఆయా పార్టీలకు రాజీనామా చేశారు.
పార్టీల ఒంటెత్తు పోకడలకు నిరసనగానే తాము రాజీనామా చేస్తున్నట్లు ఆయా నాయకులు చెబుతున్నారు. కాంగ్రెస్కు రాజీనామా చేసిన మాజీ మంత్రి సంభానితోపాటు ఈ నాయకులందరూ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర నేతృత్వంలో ఎర్రవల్లిలోని ఫాంహౌస్లో సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఈ నేతలు ఆయా నియోజకవర్గాల్లో బలమైన నాయకులుగా ఉండడంతో ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు భారీ మెజారిటీ లభించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతున్న బీఆర్ఎస్ను మరింత బలోపేతం చేసేందుకే తామంతా పార్టీలో చేతున్నట్లు వారు ప్రకటించారు. పార్టీలో చేరిన నాయకుల సేవలు వినియోగించుకోవాలని ఖమ్మం జిల్లా నేతలకు సీఎం కేసీఆర్ సూచించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వీరిని ముందుగా ప్రగతిభవన్కు పిలిపించుకొని పార్టీలోకి ఆహ్వానిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. వారికి కేటీఆర్ స్వయంగా గులాబీ కండువాలు కప్పారు. పార్టీలోకి చేరిన వారికి రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కృతజ్ఞతలు తెలియజేశారు. మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, వనమా వెంకటేశ్వరరావు, హరిప్రియానాయక్లు పార్టీలోకి చేరిన వారికి ధన్యవాదాలు తెలిపారు.