కొత్తగూడెం క్రైం, ఏప్రిల్ 10 : పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దుల్లో పోలీస్ అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు అన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల పోలీస్ అధికారులతో ఎస్పీ బుధవారం తన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఏజెన్సీ ప్రాంత ఠాణాల్లో పనిచేసే అధికారులంతా మావోయిస్టుల కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులోని పోలీస్స్టేషన్లలో పనిచేసే అధికారులు మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. ఈ సందర్భంగా ఏజెన్సీ పోలీస్స్టేషన్లలో నమోదైన కేసుల వివరాలు, అక్కడి ప్రస్తుత పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఏజెన్సీలోని పోలింగ్ కేంద్రాలను ఎప్పటికప్పుడు సందర్శిస్తూ భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఈ క్రమంలో ఆయా ప్రాంత ప్రజలకు అండగా ఉంటూ.. వారి సమస్యలను సంబంధిత అధికారుల సమన్వయంతో పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. ఏజెన్సీ సరిహద్దు గ్రామాల ప్రజలు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని.. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు పాటుపడాలని అధికారులకు సూచించారు. సమావేశంలో అదనపు ఎస్పీ(ఆపరేషన్స్) టి.సాయిమనోహర్, ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను, పాల్వంచ డీఎస్పీ ఆర్.సతీశ్కుమార్, మణుగూరు డీఎస్పీ వి.రవీందర్రెడ్డి, ఏజెన్సీ ప్రాంత పోలీస్ అధికారులు పాల్గొన్నారు.