భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): పారిశుధ్య నిర్వహణలో భద్రాద్రి జిల్లాకు దేశంలోనే మూడో రాంకు వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వ మిషన్ డైరెక్టర్ స్వచ్ఛ భారత్ జల్జీవన్ మిషన్ అదనపు కార్యదర్శి వికాస్ సీల్ ప్రకటించారు. పారిశుధ్య నిర్వహణ, స్వచ్ఛతపై జనవరి 6, 7, 8, 9, ఏప్రిల్ 21 తేదీల్లో కేంద్ర పరిశీలన బృందాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించాయి. నివేదికలను కేంద్రానికి పంపాయి. వీటిని పరిశీలించిన స్వచ్ఛ భారత్ మిషన్ గురువారం ఈ ర్యాంకులను ప్రకటించింది. ఇందులో భద్రాద్రికి మూడో ర్యాంకు లభించింది.
నూకలాంపాడుకు రెండో అవార్డు..
వైరా, సెప్టెంబర్ 22: పారిశుధ్య నిర్వహణలో ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం నూకలాంపాడు గ్రామానికి జాతీయ స్థాయిలో రెండో అవార్డు లభించింది. ‘ఆజాదీ కా అమృత్’ మహోత్సవాల్లో భాగంగా స్వచ్ఛభారత్ మిషన్ కింద ఏటా కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా షార్ట్ఫిల్మ్ పోటీలను నిర్వహిస్తోంది. ఈ పోటీల్లో నూకలాంపాడు పంచాయతీ ఆధ్వర్యంలో నిర్మించిన ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణలో ఈ షార్ట్ఫిల్మ్కు రెండో అవార్డు లభించింది. ఈ అవార్డును ఆ గ్రామ సర్పంచ్ ఇంజం శేషగిరిరావుకు గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఢిల్లీలో రాష్ట్రపతి ముర్ము అందజేయనున్నారు.