కొత్తగూడెం టౌన్, మార్చి 28 : కోర్టుల్లో ఏళ్లతరబడి పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించుకోవడానికి, సత్వర న్యాయం కోసం లోక్ అదాలత్ ఒక అద్భుతమైన వేదిక అని భద్రాద్రి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ పేర్కొన్నారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా ఏర్పాటు చేసిన న్యాయ అవగాహన కార్యక్రమంలో న్యాయమూర్తి పాల్గొని మాట్లాడారు. రాజీ మార్గమే రాజమార్గమని, రాజీమార్గంలో కేసులను పరిష్కరించుకోవడం ద్వారా ఇరుపక్షాలు స్నేహ పూర్వక వాతావరణంలో తమ కేసులను పరిష్కరించుకునేందుకు ఇదొక సువర్ణావకాశమని తెలిపారు.
సివిల్, కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, మెయింటెనెన్స్ కేసులు, బ్యాంక్ రికవరీ, మోటర్ వాహన ప్రమాద బీమా కేసులను ఇరువర్గాలు పరస్పర అంగీకారంతో రాజీ పడవచ్చని సూచించారు. కాగా.. ఎస్బీఐ సౌజన్యంతో కక్షిదారులకు పులిహోర, మంచినీళ్ల సదుపాయం కల్పించారు. న్యాయమూర్తులు సరిత, రాజేందర్, కిరణ్కుమార్, సుచరిత, బత్తుల రవికుమార్, వినయ్కుమార్, సాయిశ్రీ, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, కోర్టుల సిబ్బంది పాల్గొన్నారు.