భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక సూచించారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బుధవారం కొత్తగూడెంలో నిర్వహించిన ఓటరు అవగాహన ర్యాలీని, రన్ను ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ‘ఐ ఓట్ ఫర్ ష్యూర్’ పేరిట జరిగిన ఈ ర్యాలీ పోస్టాఫీస్ సెంటర్ నుంచి బస్టాండ్ సెంటర్ మీదుగా మార్కెట్ యార్డు వరకు సాగింది. ఈ సందర్భతంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దేశంలో ప్రతీ పౌరుడికీ సమాన విలువ కలిగిన ఓటు హక్కును రాజ్యాంగం మనకు కల్పించిందని అన్నారు.
అలాంటి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోలింగ్ శాతం పెంచాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. విద్యావంతులు కూడా ఓటు హక్కును వినియోగించుకోలేకపోవడం విచారకరమని అన్నారు. మే 13న జరిగే లోక్సభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. 2024 ఏప్రిల్ 1 వరకు 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఈ నెల 15లోగా కొత్త ఓటరుగా తమ పేరును నమోదు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు, వృద్ధులు ఓటు వేసేలా ప్రోత్సాహం కల్పిస్తున్నామన్నారు. జిల్లా సంక్షేమ అధికారి వేల్పుల విజేత, డీఆర్డీవో విద్యాచందన, ఇతర అధికారులు పాల్గొన్నారు.