భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 26 (నమస్తే తెలంగాణ): ప్రజాసంక్షేమమే రాష్ట్రప్రభుత్వ ధ్యేయమని భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆల అన్నారు. కొత్తగూడెంలోని ప్రగతి మైదానంలో శుక్రవారం నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలో ఎస్పీ రోహిత్రాజ్తో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. 1950 జనవరి 26న ఎంతో మంది త్యాగధనుల కృషితో భారత్ సర్వతంత్ర గణతంత్ర రాజ్యంగా ఏర్పడిందన్నారు. అప్పటి నుంచి ఏటా జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకొంటున్నామన్నారు. రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని పక్కాగా అమలు చేసిందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కాలేజీ, స్కూల్ విద్యార్థినులకు పథకం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సర్కార్ రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచిందన్నారు.
జిల్లాలో ఇప్పటి వరకు 2,37,530 మంది ఆరోగ్యశ్రీ కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఇప్పటివరకు 250 మంది ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధిపొందారన్నారు. ఆరు గ్యారెంటీల దరఖాస్తులను ఇప్పటికే ఆన్లైన్ చేశామన్నారు. జిల్లావ్యాప్తంగా 3,34,227 దరఖాస్తులు తీసుకున్నామన్నారు. జిల్లాలో సాగునీటి పథకాల నిర్మాణ పనులను వేగవంతం చేస్తామన్నారు. అనంతరం కళాకారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. వేడుకలో జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు, ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, కోరం కనకయ్య, జారె ఆదినారాయణ, అదనపు కలెకర్లు రాంబాబు, డీఆర్వో రవీంద్రనాథ్, డీపీవో రమాకాంత్, డీఎస్వో వెంకటేశ్వర్లు, సీఈవో విద్యాలత, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సులోచన, డీఏవో అభిమన్యుడు, ఆర్అండ్బీ ఈఈ బీమ్లా, ఎస్ఈ రమేష్ పాల్గొన్నారు.