కొత్తగూడెం ఎడ్యుకేషన్, అక్టోబర్ 18 : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారమే ఇవ్వాలని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ అన్నారు. మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని పాతకొత్తగూడెం హైస్కూల్ను ఆయన తనిఖీ చేశారు. ఎఫ్ఎల్ఎన్ అమలు తీరును పరిశీలించారు. పిల్లల గణిత సామర్థ్యాన్ని పిల్లలను పరీక్షించారు. వారి సమాధానాలపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల వద్ద షెడ్యూల్ లేకపోవడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎఫ్ఎల్ఎన్ షెడ్యూల్కు సంబంధించిన హార్డ్ కాపీని కలిగి ఉండాలని, జిల్లా వ్యాప్తంగా 15 రోజుల పాటు కార్యక్రమం తప్పకుండా అమలు చేయాలన్నారు. ప్రతి పాఠశాలలో హెచ్ఎం, ఉపాధ్యాయులు సవ్యంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. హెచ్ఎం కవిత, జిల్లా విద్యాశాఖ కో ఆర్డినేటర్లు నాగరాజశేఖర్, సైదులు, సతీశ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతి నీటి బిందువును సంరక్షించుకుందాం
కలెక్టర్ దురిశెట్టి అనుదీప్
జలమే జీవనమని… ప్రతి నీటి బిందువును సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ అన్నారు. మంగళవారం డీఆర్డీవో సమావేశ మందిరంలో కేంద్రీయ భూగర్భ జలబోర్డు ఆధ్వర్యంలో భూగర్భ జలాల వృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై వ్యవసాయ, ఇరిగేషన్, మిషన్ భగీరథ, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సుజాతనగర్, దమ్మపేట మండలాల్లో భూగర్భ జలమట్టం క్రమంగా తగ్గుతున్నదని, ఈ ప్రాంతాల్లో భూగర్బ జలాలు పెంచేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. పంటలకు కావాల్సినంత మేర నీరు అందించడం వల్ల మేలు జరుగుతుందన్నారు. జిల్లాలో గతేడాది నుంచి చేపట్టిన నీటి సంరక్షణ చర్యలతో జలాలు పెంపొందాయని అన్నారు. నీటి సంరక్షణ చర్యలపై ప్రజలకు అవగాహన, పరిజ్ఞానాన్ని కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో కేంద్ర భూగర్భ జలబోర్డు ప్రాంతీయ సంచాలకుడు సిద్ధ్దార్ద్ కుమార్, సైంటిస్టులు రాని, రేష్మాపిైళ్లె, రాఘవేందర్, డీఆర్డీఏ పీడీ మధుసూదన్రాజు, భూగర్భ జల అధికారి బాలు, సింగరేణి డిప్యూటీ జీఎం శ్రీనివాసరావు పాల్గొన్నారు.