ఎస్సీ కుటుంబాల అభ్యున్నతే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, ‘దళిత బంధు’ పథకంపై ఎలాంటి అపోహలు అవసరం లేదని భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ పేర్కొన్నారు. దళిత బంధు పథకం అమలు, లబ్ధిదారుల ఎంపిక తదితర అంశాలపై ‘నమస్తే తెలంగాణ’ కలెక్టర్ను ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్కో ఎస్సీ కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షలు మంజూరు చేస్తుందని, ప్రతి నియోజకవర్గం నుంచి 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా 500 కుటుంబాలకు రూ.50 కోట్ల నిధులు అందనున్నాయని పేర్కొన్నారు. ఆయా నియోజకవర్గాల్లో మంత్రితోపాటు ఎమ్మెల్యేలు లబ్ధిదారులను ఎంపిక చేస్తారని, ఈ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉంటుందన్నారు. ఇప్పటికే ఐదు నియోజకవర్గాల పరిధిలో ఐదుగురు ప్రత్యేక అధికారులను నియమించామని, వీరంతా లబ్ధిదారుల వద్దకు వెళ్లి దళిత బంధుపై అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 3 (నమస్తేతెలంగాణ): ‘దళిత బంధు పథకంపై ఎస్సీ కుటుంబాలకు ఎలాంటి అపోహలు అవసరం లేదు. తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ కార్యాచరణతో పథకాన్ని అమలు చేయనున్నది. ఎస్సీలు వివక్షకు గురికాకూడదు. వారు సాధికారిత దిశగా ముందుకు వెళ్లాలి. ఆర్థికంగా, సామాజికంగా వృద్ధి చెందాలి. రుణాలు ఇవ్వడం ద్వారా, రేషన్ కార్డుల ప్రాతిపాదికన ఆధారపడి ఎస్సీల అభ్యున్నతి ఉండకూడదు. ప్రతి ఎస్సీ కుటుంబం ఆర్థిక ప్రగతి సాధించాలి’ అంటున్నారు భద్రాద్రి కలెక్టర్ అనుదీప్. దళిత బంధు పథకంపై ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తున్నామని, ఇప్పటికే ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక అధికారులను నియమించామంటున్నారు. ఈ నెలలో లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి మార్చి మొదటి వారంలో యూనిట్ల గ్రౌండింగ్ పూర్తి చేసేందుకు కార్యాచరణ చేస్తున్నామన్నారు. పథకం అమలుపై ఆయన ‘నమస్తే’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ
నమస్తే : పథకంపై ఎన్నో అపోహలు బయట వ్యక్తమవుతున్నాయి? పథకాన్ని అమలు చేసేందుకు మీ వద్ద స్పష్టమైన కార్యాచరణ ఉందా ?
కలెక్టర్ : పథకంపై ఎలాంటి అపోహలు వద్దు. ప్రభుత్వం ఎస్సీ కుటుంబాల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నది. పథకంలో నెలకొల్పే యూనిట్లు కేవలం లబ్ధిదారు కుటుంబానికే కాదు ప్రజల అవసరాలకూ ఉత్పత్తులు ఉపయోగపడాలి. లేదా యూనిట్ ద్వారా సేవలు అందాలి. అలాంటి యూనిట్లకే ప్రాధాన్యం. వ్యవసాయ పరంగా ఎంతో మిషనరీని ఇతర ప్రాంతాల నుంచి తీసుకువస్తున్నాం. అలాంటి యూనిట్ల లబ్ధిదారులకు ఉపాధినివ్వడమే కాక ప్రజలకు ఉపయోగపడతాయి.
నమస్తే : జిల్లాకు ఎన్ని నిధులు మంజూరు అయ్యాయి ? ఎంతమంది లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు ?
కలెక్టర్ : ప్రతి నియోజకవర్గం నుంచి 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేస్తాం. ఒక్కో ఎస్సీ కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షలు మంజూరు చేస్తుంది. ఈ చొప్పున జిల్లావాప్తంగా 500 కుటుంబాలకు రూ.50 కోట్ల నిధులు అందనున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో మంత్రితో పాటు ఎమ్మెల్యేలు లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఎంపిక జాబితాను కలెక్టర్ పర్యవేక్షణలో ప్రత్యేకాధికారి పరిశీలిస్తారు. పూర్తి స్థాయిలో విచారణ పూర్తయ్యాకే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. ఈ ప్రక్రియ పారదర్శకంగా ఉంటుంది. బ్యాంకు లింకేజ్ ఉండవు. రుణాలు ఉండవు. నేరుగా కలెక్టర్ ఖాతా నుంచే లబ్ధిదారులకు సొమ్ము అందుతుంది.
నమస్తే : లబ్ధిదారులతో ఎలాంటి యూనిట్లను నెలకొల్పేలా చర్యలు తీసుకుంటారు?
కలెక్టర్ : లబ్ధిదారుడు ఎంచుకునే యూనిట్ లాభసాటి అయి ఉండాలి. లబ్ధిదారుడికి ఆ పనిపై నైపుణ్యాలు ఉండాలి. ఇటుకల బట్టీలు, అత్యాధునిక వ్యవసాయ పరికరాలు, వరికోత యంత్రాలు, హార్వెస్టింగ్ పరికరాలు, టిప్పర్లు, స్వచ్ఛ ఆటోలు, డీలర్షిప్స్, కంప్యూటర్ ఇంటర్నెట్, చిల్లీ ప్రాసెసింగ్ వంటి యూనిట్లు లబ్ధిదారులు ఎంచుకోవచ్చు. ప్రజావసరాలకు ఉపయోగపడే యూనిట్లకు ప్రాధాన్యం ఉంటుంది. యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియను యంత్రాంగమే చూసుకుంటుంది.
నమస్తే : పథకం అమలుకు ప్రత్యేక అధికారులను నియమించారా ?
కలెక్టర్ : జిల్లాలోని ఐదు నియోజకవర్గాల పరిధిలో ఐదుగురు ప్రత్యేక అధికారులను నియమించాం. కొత్తగూడెం నియోజకవర్గానికి డీఆర్డీవో మధుసూదనరాజు, ఇల్లెందుకు ఉద్యానశాఖ అధికారి మరియన్న, పినపాకకు ఇరిగేషన్ ఈఈ రాంప్రసాద్, అశ్వారావుపేటకు జిల్లా పరిశ్రమల శాఖ అధికారి సీతారాంనాయక్, భద్రాచలానికి డీసీవో వెంకటేశ్వరరావు, జిల్లా పరిధిలోని వైరా నియోజకవర్గంలో భాగమైన జూలూరుపాడుకు ఆర్అండ్బీ ఈఈ భీమ్లాను నియమించాం. వీరంతా లబ్ధిదారుల వద్దకు వెళ్లి దళితబంధుపై అవగాహన కల్పిస్తారు. యూనిట్ల స్థాపన, లబ్ధిదారుల ఎంపిక తదితర ప్రక్రియలు చేపడతారు.
నమస్తే : లబ్ధిదారులకు మొత్తం రూ.10 లక్షలు ఒకేసారి ఇస్తారా? ఇంకా ఇతర నిబంధనలు ఏమైనా ఉంటాయా?
కలెక్టర్ : ప్రతి లబ్ధిదారుకు ప్రభుత్వం నుంచి రూ.10 లక్షలు మంజూరవుతాయి. దీనిలో రూ.10 వేలను దళిత రక్షణ నిధిలో జమ చేస్తాం. మిగిలిన రూ. 9.90 లక్షలు లబ్ధిదారులకు అందజేస్తాం. ‘ఒక కుటుంబం ఒక యూనిట్ పెట్టుకోవాలి’ అనే నిబంధన ఏమీ లేదు. వేర్వేరు కుటుంబాలకు చెందిన వ్యక్తులు ఇద్దరు ముగ్గురు కలిసి యూనిట్ నెలకొల్పవచ్చు.