భద్రాచలం, ఫిబ్రవరి 13 : భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఈవో ఎల్.రమాదేవిని ప్రభుత్వం కీసర ఆర్డీవోగా బదిలీ చేసిందని, వెంటనే ఆమె బదిలీని నిలిపివేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు స్థానిక అంబేద్కర్ సెంటర్లో ప్ల కార్డులు చేబూని మంగళవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు ఆకోజు సునీల్ మాట్లాడుతూ సరిగ్గా ఏడాది క్రితం ఆలయ ఈవోగా బాధ్యతలు చేపట్టిన రమాదేవి ఆలయ అభివృద్ధిపై దృష్టి సారించారన్నారు. పురుషోత్తపట్నంలో ఆలయానికి సంబంధించిన వేలాది ఎకరాల భూముల్లో శాశ్వత కట్టడాలను తొలగించి కాపాడారన్నారు.
అటువంటి అధికారిని బదిలీ చేయకుండా ఇక్కడే కొనసాగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు భీమవరపు వెంకటరెడ్డి, కోలా రాజు, పామరాజు తిరుమలరావు, మల్లెల లోకేశ్, దాసరి శేఖర్, రామోజు రాముడు తదితరులు పాల్గొన్నారు. దేవస్థానం ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈవో రమాదేవి బదిలీని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ నల్లబ్యాడ్జీలు ధరించి ఆలయ అర్చకులు, ఉద్యోగులు, సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. అలాగే ఈవో రమాదేవి బదిలీ అర్థరహితమని, ఆమె బాధ్యతలు స్వీకరించిన తర్వాతే పాలన గాడిలో పడిందని పట్టణ ప్రముఖులు గాదె మాధవరెడ్డి, ఎస్కే అజీమ్ మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో పేర్కొన్నారు.