అత్యాధునిక వైద్యపరికరాల ద్వారా గర్భిణులకు ఖమ్మం ప్రధానాసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందుతాయని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. శనివారం ఆయన ఆసుపత్రిలో స్కానింగ్ సెంటర్ను ప్రారంభించి మాట్లాడారు. ఆస్పత్రిలో కొత్తగా ఏర్పాటైన టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫ్యూటల్ ఎనామిలీస్ (టిఫ్ఫా) ద్వారా గర్భిణుల గర్భంలో శిశువుల ఎదుగుదలను సులభంగా గుర్తించవచ్చన్నారు. సీఎం కేసీఆర్ సహాయ సహకారాలతో ఆసుపత్రిలో మరిన్ని వసతులు కల్పించామన్నారు. ప్రజలకు పైసా ఖర్చులేకుండా కార్పొరేట్స్థాయి వైద్యం అందిస్తున్నామన్నారు. మంత్రి వెంట జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, కలెక్టర్ వీపీ గౌతమ్, డీఎంహెచ్వో డాక్టర్ మాలతి తదితరులు ఉన్నారు.
ఖమ్మం, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ ఆవిర్భావం అనంతరం.. ఖమ్మం ఎమ్మెల్యేగా పువ్వాడ అజయ్కుమార్ గెలుపొందిన అనంతరం.. సీఎం కేసీఆర్ సంపూర్ణ సహకారంతో ఖమ్మం జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రధాన వైద్యశాల తీరే మారిపోయింది. ఒకనాడు ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు..’ అన్న జిల్లా ప్రజలు.. ప్రస్తుతం అక్కడికే పరుగులు పెడుతున్నారంటే అతిశయోక్తి కాదు.
పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు నయాపైసా ఖర్చు లేకుండా కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో అధునాతన వసతులను అందుబాటులోకి తెచ్చిన సంగతి విదితమే. తాజాగా గర్భిణి కడుపులోని బిడ్డలో అవయవాల అమరిక, ఎదుగుదల వంటి అంశాలను తెలుసుకునేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఖమ్మం పెద్దాసుపత్రిలో ‘టిఫ్ఫా’ స్కానింగ్ ఏర్పాటు చేసింది.
దాదాపు రూ.60 లక్షలు వెచ్చించి తెచ్చిన రెండు అధునాతన యంత్రాలను ఎంసీహెచ్ భవనంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆరోగ్య తెలంగాణను ఆవిష్కరించాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని అన్నారు. దానిలో భాగంగానే రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రభుత్వ దవాఖానలను మరింత బలోపేతం చేసేందుకు అన్ని రకాల అధునాతన వసతులను కల్పిస్తున్నారని తెలిపారు.
కడుపులో పిండం వయస్సు 5, 6 నెలల కాలంలో దాని ఎదుగుదల, బిడ్డ శరీరంలోని అన్నిరకాల అవయవాల అమరికల గురించి తెలుసుకునే టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫ్యూటల్ ఎనామిలీస్ (టిఫ్పా) స్కానింగ్ సెంటర్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు వరం లాంటిదని మంత్రి అజయ్కుమార్ అభిప్రాయపడ్డారు. ప్రైవేట్లో ఈ తరహా స్కానింగ్కు రూ.3 వేల వరకు ఖర్చవుతుందని అన్నారు. హైదరాబాద్ లాంటి పెద్ద నగరాల్లో కార్పొరేట్ ఆసుపత్రులకే పరిమితమైన ఈ స్కానింగ్ను ఇక నుంచి ఖమ్మం పెద్దాసుపత్రిలో నయాపైసా ఖర్చు లేకుండా చేస్తారని తెలిపారు. ఏటా అనేకమంది చిన్నారులు ఏదో ఒక లోపంతో జన్మిస్తున్నందున ఈ సమస్యను అధిగమించి తల్లిదండ్రుల బాధలను తీర్చేందుకు సీఎం కేసీఆర్ సరికొత్త ఆలోచన చేశారని కొనియాడారు.
పెరిగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తూ టిఫ్ఫా స్కానింగ్ విధానం గురించి ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ తెలిసేలా వైద్యాధికారులు కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. ఖమ్మం ప్రధాన వైద్యశాలను రాష్ట్రంలోనే నంబర్ వన్గా తీర్చిదిద్దుతానని మంత్రి పునరుద్ఘాటించారు. తాను ఖమ్మం ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం సీఎం కేసీఆర్ సహకారంతో అనేకరకాల వసతులను అందుబాటులోకి తెచ్చినట్లు గుర్తుచేశారు. డయాలసిస్, ఐసీయూ, క్యాథ్లాబ్, తెలంగాణ డయాగ్నస్టిక్, మాతా, శిశు సంరక్షణ కేంద్రం వంటివన్నీ జిల్లా ప్రజల ముందు ఆవిష్కరించినట్లు వివరించారు.
ఈ క్రమంలోనే ఖమ్మానికి మెడికల్ కళాశాలనూ మంజూరు చేయించినట్లు గుర్తుచేశారు. అతి తొందరలోనే వైద్య విద్య తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, కలెక్టర్ వీపీ గౌతమ్, మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, ఏఎంసీ చైర్మన్ దౌలె లక్ష్మీప్రసన్న, డిఫ్యూటీ మేయర్ ఫాతిమా, డీఎంహెచ్వో డాక్టర్ మాలతి, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బీ వెంకటేశ్వర్లు, ఆర్ఎంవో డాక్టర్ బొల్లికొండ శ్రీనివాసరావు, ఏవో డాక్టర్ రాజశేఖర్గౌడ్, ఎంసీహెచ్ ఇన్చార్జి డాక్టర్ కృపా ఉషశ్రీ, డైటీషియన్ సూర్యపోగు మేరి, నర్సింగ్ సూపరింటెండెంట్ సుగుణ, నందగిరి శ్రీను, కార్పొరేటర్ బీజీ క్లెమెంట్, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.