ముదిగొండ, ఏప్రిల్ 20: చదువు పూర్తయ్యాక చేసే పనిలో అటు ఆదాయానికి ఆదాయం.. ఇటు ఆరోగ్యానికి ఆరోగ్యం ఉండాలనుకున్నాడు ఓ యువకుడు. తాను అభ్యసించిన శాస్త్ర సాంకేతిక విద్యను సంప్రదాయ సాగు బాటలో కాస్త భిన్నంగా అమలు చేయాలనుకున్నాడు బీటెక్ పూర్తి చేసిన ఓ యువకుడు. సరిగ్గా అదే సమయంలో క్షేత్ర పర్యటనలో భాగంగా వైరా కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) శాస్త్రవేత్తలు అతడి పొలాల వద్దకు వచ్చారు. తేనెటీగల పెంపకానికి ఈ ప్రాంతం అనువుగా ఉంటుందని చెప్పారు. వారి మాటలు, అప్పటికే అతడి మనసులో ఉన్న వినూత్న ఆలోచనలు.. సంప్రదాయ సాగును భిన్నంగా చేద్దామనే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టాయి. ఫలితంగా తక్కువ శ్రమ, పరిమిత పెట్టుబడితో తేనెటీగల పెంపకానికి ముందడుగు వేశాడు. మొదట్లో తక్కువస్థాయిలో ఆశాజనకంగా ఉన్నప్పటికీ క్రమేపీ మెరుగవుతోంది. ఒక్కసారి సీజన్ వచ్చిందంటే చాటు.. అధిక లాభాలు పంచే అవకాశం ఉంది. బీటెక్ చదివిన ఆ యువకుడు సాంకేతికత వైపు మళ్లకుండా సాగువైపు మొగ్గుచూపాడు.
ఎరువులు, పురుగుమందులు విచక్షాణ రహితంగా వినియోగించి పంటలు పండించకుండా వినూత్నంగా ఆలోచించి తేనెటీలపెంపకాన్ని చేపట్టాడు. అతడే.. ముదిగొండ మండలం ఖానాపురం గ్రామానికి చెందిన పోకల మురళి. వినూత్నంగా వ్యవసాయాన్ని చేద్దామన్న ఆలోచనతో సంప్రాదాయ పంటలతోపాటు జామ తోట సాగును ప్రారంభించాడు. మరోవైపు చేపల చెరువునూ ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు కొందరు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఓ రోజు ఇతడి పొలం వద్దకు వచ్చారు. ఆ ప్రాంతాన్ని నిశితంగా గమనించిన వారు.. తేనెటీగల పెంపకానికి అనువుగా ఉంటుందని తేల్చారు. ఇదే విషయాన్ని మురళితోనూ చెప్పారు. దీంతో అతడు ఆలోచనలు పరిపరి విధాలాకూ వెళ్లాయి. చివరికి తేనెటీగల పెంపకానికి మొగ్గు చూపాయి. దీంతో అతడు కేవీకేలో కొద్ది రోజులు ట్రైనింగ్ తీసుకున్నాడు. ఒకేసారి పెద్దమొత్తంలో కాకుండా రూ.1.50 లక్షల పెట్టుబడితో 20 బాక్సులను ఏడాది క్రితం ఏర్పాటు చేశాడు. మొదట్లో కొన్ని రోజులు కష్టాలు, ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ శాస్త్రవేత్తల సలహాలు, సూచనలతో మరింత జాగ్రత్తగా సంరక్షణ చర్యలు తీసుకోవడంతో తేనెటీగలు కుదురుకున్నాయి.
ఎక్కువ పూలను అందుబాటులో ఉంచడం మినహా తీనెటీగల పెంపకానికి పెద్దగా ఖర్చు ఉండదు. ప్రతీ బాక్సులో పంచదార సిరప్ ఉంచితే ఆకలైనప్పుడు అవి తేనెను తాగవు. ఈ సిరప్ కోసం నెలకు రూ.100 ఖర్చవుతుంది. అయితే తేనెటీగల పెంపకం ద్వారా ఓ ఆదాయం వస్తుండగా.. అంతర పంటల సాగు ద్వారా మరికొంత లాభం వస్తుంది. పైగా సేంద్రియ పద్ధతిలో పంటలతో పండించే పంటలు కాబట్టి ఆరోగ్యానికి ఆరోగ్యమూ చేకూరుతుంది.
తేనెటీగల పెంపకానికి పెట్టుబడి, శ్రమ తక్కువే. మొదటిసారి పెట్టుబడి పెట్టి ఏర్పాటు చేసుకుంటే చిన్నచిన్న ఖర్చులు మినహా పెద్ద ఖర్చులేవీ ఉండవు. మకరందం చేరిన ఫ్రేముల నుంచి తేనెను తీయటం మినహా ఏ శ్రమా ఉండదు. మరోవైపు అంతర పంటల సాగు ద్వారా రెండో ఆదాయం లభిస్తుంది. సేంద్రియ పంటలతో ఆరోగ్యమూ చేకూరుతుంది.
-పోకల మురళి, యువ రైతు, ముదిగొండ