నర్సాపూర్, ఆగస్టు 9 : నామినేటెడ్ పోస్టుల కోసం ఆశగా ఎదురుచూస్తున్న కాంగ్రెస్ నేతలకు నిరాశే ఎదురవుతున్నది. రాష్ట్రంలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో నామినేటెడ్ పోస్టులు భర్తీ అయ్యాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో మాత్రం నామినేటెడ్ పోస్టుల భర్తీకి రాజకీయ గ్రహణం వీడడం లేదు. ఎప్పుడూ ఎప్పుడూ అని ఎదురు చూస్తున్న నాయకులు, కార్యకర్తలకు నిరాశే మిగిలింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు మూడేండ్లు సమీపిస్తున్నా, నేడు,రేపు అంటూ పార్టీ పెద్దలు కాలయాపన చేస్తుండడంతో నేతలు నిరాశకు లోనవుతున్నారు.
ముఖ్యంగా నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు ఎక్కువయ్యాయి. ఎవరికివారే యమునాతీరే అన్నచందంగా పార్టీ తయారైంది. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డిపల్లి ఆంజనేయులుగౌడ్ ఒకవర్గం ఉండగా , కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి ఒకవర్గం ఉండగా, నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి మరోవర్గం, అలాగే గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్పర్సన్ చిలుముల సుహాసినిరెడ్డిది మరో వర్గం. నామినేటెడ్ పోస్టులు తక్కువగా ఉండడం, నాయకుల నుంచి విపరీతంగా పోటీ ఉండటంతో పోస్టుల భర్తీ చేయడం సదరు నాయకులకు తలనొప్పిగా మారింది. ఏ పదవి ఎవరికి ఇస్తే ఏమవుతుందోనని వారు మాకెందుకులే అని నిమ్మకుండిపోతున్నారు.
నర్సాపూర్ ఎమ్మెల్యే తర్వాత, ఆస్థాయిలో చెప్పుకోదగ్గ పోస్టులో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్టు ఉంటుంది. ఈ పోస్టు బీసీ జనరల్కు రిజర్వు కావడంతో దీనికి డిమాండ్ బాగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి ఇప్పటి వరకు పోస్టుల భర్తీకి ఆసక్తి చూపకపోవడంతో క్యాడర్,లీడర్ నిరుత్సాహానికి గురవుతున్నారు. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేశామని, అధికారంలోకి వచ్చాక ఏదో ఒక పోస్టు వస్తుందిలే అని ఆశపడ్డ నాయకుల్లో తీవ్ర అసహనం పెరిగిపోయింది. రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పోస్టుల భర్తీ చేస్తామని పార్టీ పెద్దలు చెప్పినప్పుడల్లా స్థానిక నాయకుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
తదనంతరం పరిణామాలతో మిన్నకుండిపోవడం పరిపాటిగా మారింది. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్తో పాటు వైస్ చైర్మన్, డైరెక్టర్లు భర్తీ చేయనున్నారు. కౌడిపల్లి మండలంలోని తునికి నల్లపోచమ్మ దేవస్థానం ఆలయ కమిటీ, శివ్వంపేట మండలం సికింద్లాపూర్ శ్రీలక్ష్మీనర్సింహస్వామి దేవాలయ కమిటీ, హత్నూర మండలం శేర్ఖాన్పల్లి పలుగుపోచమ్మ దేవాలయ కమిటీ, నర్సాపూర్ శ్రీఆదిలక్ష్మీనారాయణ దేవాలయ కమిటీ చైర్మన్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఆత్మ కమిటీ చైర్మన్తో పాటు వైస్ చైర్మన్ డైరెక్టర్లను నియమించాల్సి ఉంది. వీటన్నింటిని నియమిస్తే పదుల సంఖ్యలో నాయకులు, కార్యకర్తలకు ఏదో ఒక పోస్టు వచ్చి, వారు మరింత ఉత్సాహంగా పనిచేయడానికి ఆస్కారం ఉంది.
నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డిపల్లి ఆంజనేయులుగౌడ్ , కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి నడుమ సయోధ్య లేకనే నామినేటెడ్ పోస్టులు నియమించడానికి ఆసక్తి చూపడం లేదని బహిరంగ విమర్శలు ఉన్నాయి. నాయకులు మాత్రం అవకాశం వచ్చినప్పుడల్ల నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఇరువురు నేతలను ఎక్కడపడితే అక్కడ అడుగుతున్నా, వారు మాత్రం దాటవేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికైనా ఇరువురు నాయకులు సయోధ్యతో నియోజకవర్గంలోని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయడంపై దృష్టిసారించాలని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కోరుతున్నారు.